
ఐపీఎల్ 2022లో సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 52పరుగుల తేడాతో విజయం సాధించడంలో పాట్ కమ్మిన్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తన బౌలింగ్లో ఒకే ఓవర్లో 3వికెట్లు పడగొట్టాడు. కమిన్స్ ఈ సీజన్లో కేకేఆర్ జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటన ముగించుకున్నాక అతను ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్పై 15బంతుల్లో 56 పరుగులు చేసి అద్భుత విజయాన్ని కేకేఆర్కు అందించాడు. ఆ మ్యాచ్లో రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. కానీ అతని నాలుగు ఓవర్లలో 49పరుగులొచ్చాయి. ఇక తన తర్వాతి మూడు మ్యాచ్లలో కమిన్స్ అంతగా రాణించలేదు. దీంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. ఇక చావోరేవో అనే తరుణంలో అతను తిరిగి జట్టులో సోమవారం నాటి ముంబైతో జరిగిన రెండో మ్యాచ్లో బరిలో దిగాడు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో 22పరుగులే ఇచ్చి 3వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ క్రమంలో పాట్ కమిన్స్ను కేకేఆర్ ఫ్రాంఛైజీ నాలుగు మ్యాచ్లకు జట్టు నుండి తప్పించడం పట్ల భారత మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నాలుగు మ్యాచ్ల్లో కమిన్స్ను బెంచ్ మీద కూర్చోబెట్టి కేకేఆర్ ఏం చేస్తుందో అర్థం కాలేదన్నాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్, వరల్డ్ కప్ విజేత, ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన కమిన్స్ను ఉపయోగించుకోకుండా బెంచ్ మీద కూర్చోబెట్టి మేపినందుకు కేకేఆర్ భారీ మూల్యం చెల్లించుకుందని హిందీలో రవిశాస్త్రి దుయ్యబట్టాడు.

కమిన్స్ జట్టులోకి తిరిగి రావడంతో కీలకమైన ముంబై ఇండియన్స్ మ్యాచ్లో జట్టు విజయానికి అతని బౌలింగ్ దోహదపడింది. తద్వారా కేకేఆర్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంపై ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. కేకేఆర్ ప్రస్తుతం 12గేమ్లలో 10పాయింట్లతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ (43), నితీష్ రాణా (43) రాణించడంతో తొమ్మిది వికెట్ల నష్టానికి కేకేఆర్ 165 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో కేకేఆర్ సులభంగా 200పరుగుల మార్కును క్రాస్ చేస్తుందనిపించింది. కానీ ఐపీఎల్లో తన తొలి ఐదు వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా కేకేఆర్ స్కోరుకు కళ్లెం వేశాడు. ఇక ఛేజింగ్లో ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.