
తాజాగా ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. అప్పుడు 2014లో టీమిండియా 4 టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్ట్ మ్యాచ్కు పలు కారణాలతో ధోని దూరమవడంతో ఆ మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించాడు కోహ్లీ. అనంతరం ధోని మిగతా మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్నాడు. అయితే అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం ధోని టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని అప్పుడు టీమ్ డైరెక్టర్గా ఉన్న రవిశాస్త్రి తాజాగా వివరించాడు. ఆ మ్యాచ్ను టీమిండియా అద్భుత ఆట తీరుతో డ్రా చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని తన దగ్గరకు వచ్చి రవి భాయ్ నేను టీమ్ మెట్స్ అందరికీ ఓ విషయం చెప్పలనుకుంటున్నానని అన్నాడని రవిశాస్త్రి తెలిపాడు. దానికి తాను సరే చెప్పు అన్నానని, బహుషా మ్యాచ్ డ్రా గురించి మాట్లాడుతాడేమో అనుకున్నానని శాస్త్రి చెప్పాడు.
కానీ ధోని తాను తన టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పేసినట్టు తెలిపాడు. తన లాస్ట్ మ్యాచ్ కూడా ఆడేశానని, మూడో టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో లాస్ట్ది అని చెప్పాడని వివరించాడు. ఆ సమయంలో తాను షాక్కు గురయ్యానని, అంతేకాకుండా తాను ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లోని అందరి ముఖాలు చూశానని అందరూ ధోని నిర్ణయంతో షాక్కు గురయ్యారని తెలిపాడు. ఆ మ్యాచ్ డ్రా కావడంతో బహుషా రిటైర్మెంట్కు అదే సరైన సమయం అని ధోని అనుకోని ఉండొచ్చన్నాడు. అయితే సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రిటైర్మెంట్ ఇచ్చేయడం మాత్రం షాక్కు గురి చేసిందన్నాడు.
అంతేకాకుండా తన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడని ధోనికి అప్పుడు తెలుసని శాస్త్రి చెప్పాడు. తన శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికే ధోని అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా తన వైట్ బాల్ క్రికెట్ను ధోని పొడిగించాలని అనుకున్నాడని అందుకే టెస్ట్ల నుంచి తప్పుకున్నాడని శాస్త్రి వివరించాడు. ఆ తర్వాత 2019 జూలై 9న న్యూజిలాండ్తో ఆడిన వన్డే మ్యాచ్ అనంతరం ధోని ఇంటర్నేషనల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.
టెస్ట్ క్రికెట్లో 90 మ్యాచ్లు ఆడిన ధోని 38 సగటుతో 4,876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 224 పరుగులు. ఇక 350 వన్డే మ్యాచ్లు ఆడిన ధోని 50 సగటుతో 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెరీర్లో 98 టీ20 మ్యాచ్లు ఆడి 37 సగటుతో 1617 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.