
షరతులు విధించిన రవిశాస్త్రి
రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి అయిష్టత చూపించడంతో బీసీసీఐ దరఖాస్తు చేసుకోని చెప్పడం.. కోచ్ పదవి ఇస్తానంటేనే తాను దరఖాస్తు చేస్తానని రవిశాస్త్రి షరతులు విధించిన సంగతి తెలిసిందే. అయితే రవిశాస్త్రికి కోహ్లీ మద్దతు తోడవడం... ఆ తర్వాత మనసు మార్చుకుని కోచ్ పదవికి దరఖాస్తు చేయడం వెనుక క్రికెట్ లెజెండ్ సచిన్ ఉన్నాడనే వార్తలు వచ్చాయి. మంగళవారం టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

కోహ్లీతో చర్చించాకే బీసీసీఐ ఈ నిర్ణయం
సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) రవిశాస్త్రి పేరును సూచించగా, అందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సీఏసీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించాకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అనిల్ కుంబ్లే స్ధానంలో రవిశాస్త్రి కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2019 వరల్డ్ కప్ వరకు టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి కొనసాగనున్నాడు. కోచ్ నియామకంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మాటను నెగ్గించుకున్నాడు. లంక పర్యటనతో రవిశాస్త్రి తన బాధ్యతల్ని చేపట్టే అవకాశం ఉంది.

కోహ్లీ పాత్ర స్పష్టంగా
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి కోచ్గా ఎంపిక ప్రక్రియలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర స్పష్టంగా కనిపించింది. కుంబ్లే రాజీనామా నుంచి రవిశాస్త్రిని కోచ్గా నియమించే వరకు కోహ్లీ కోరుకున్నట్లే జరిగింది. నిజానికి చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందే రవిని కోచ్ను చేస్తే బాగుంటుందని సీఏసీకి కోహ్లి సూచించాడు. కానీ కొత్త కోచ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోలేదు.

తదుపరి కోచ్ సెహ్వాగ్ అన్న ప్రచారం
దీంతో కుంబ్లే రాజీనామాను అడ్డం పెట్టుకొని మరోసారి గడువు పెంచి అతడిని బరిలో నిలిచేలా చేసింది బీసీసీఐ. ఈ క్రమంలో సీఏసీలో గంగూలీ ఉండటంతో రవిశాస్త్రి కోచ్ అవడం కష్టమేనని అంతా భావించారు. గతేడాది కూడా రవిశాస్త్రిని కాదని కుంబ్లేని కోచ్గా ఎంపిక చేసిన గంగూలీ ఈసారి కూడా చివరిదాకా అదే ప్రయత్నం చేశాడు. అంతేకాదు అనూహ్యంగా టీమిండియా తదుపరి కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ అన్న ప్రచారం కూడా సాగింది. ఇంటర్వ్యూలో మిగతావారి కంటే సెహ్వాగ్ ఇచ్చిన ప్రజెంటేషన్ సీఏసీకి బాగా నచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయి.

ఫలించని గంగూలీ వ్యూహాలు
ఈ నేపథ్యంలో ఈసారి కూడా గంగూలీ కోరుకున్నదే జరగబోతోందని అందరూ భావించారు. కోచ్ ఎంపికపై కెప్టెన్తో మాట్లాడాలి అని గంగూలీ అన్నపుడు కూడా రవిశాస్త్రిని పక్కన పెట్టేశారన్న సందేహాలు కలిగాయి. కానీ ఈసారి మాత్రం గంగూలీ వ్యూహాలు ఫలించలేదు. కోచ్తో 24 గంటలూ పనిచేయాల్సింది కెప్టెనే అని, దీంతో అతని నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి కాదన్న భావనతోనే సీఏసీ రవిశాస్త్రి వైపు మొగ్గేలా చేసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











