సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
ఈ సిరీస్ను కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. కాగా, గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో టీమిండియానే విజయం సాధించింది. కోచ్గా రవిశాస్త్రి హయాంలో 2018/19, 2020/21లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది.

మరో మూడు రోజుల్లో సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఎలా పోరాడాలో చెప్పాడు. ''సిరీస్ చాలా కఠినంగా ఉంటుంది. గత మూడు పర్యటనతో నా అనుభవంతో చెబుతున్నా.. అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాను ఓడించే క్రమంలో ఒక్క తప్పు అడుగు వేసినా వెంటనే మ్యాచ్ పెవిలియన్కు చేరుతుంది. ఒక్క అంగుళం కూడా అవకాశం ఇవ్వొద్దు. అప్పుడే పైచేయి సాధించగలం. మరో మార్గం లేదు''
''అంతేగాక మీడియా ఏం అంచనాలు పెట్టుకుంటుందో ముందే గ్రహించండి. వాళ్లంతా ఆస్ట్రేలియాకు మద్దతుగా ఉంటారు. కానీ మీరు గొప్పగా శ్రమించి సత్తాచాటితే మీడియా మిమ్మల్ని గౌరవిస్తుంది'' అని రవిశాస్త్రి అన్నాడు. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. జైస్వాల్ ప్రపంచశ్రేణి ప్లేయర్ అని, ఇంగ్లండ్పై సత్తాచాటాడని, ఆస్ట్రేలియాలోనూ అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయితే అతను పరిస్థితులను జాగ్రత్తగా వహించాలని, తొలి టెస్టు వేదిక పెర్త్లో బౌన్స్ను అర్థం చేసుకోవాలని సూచించాడు.