IND vs ENG: లీడ్స్ టెస్ట్లో భారత జట్టు ఘోర పరాజయం తర్వాత భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఒక కీలక సలహా ఇచ్చారు. టీమిండియా ఇంగ్లండ్లో విజయం సాధించడానికి అవసరమైన మంత్రాన్ని కూడా రవిశాస్త్రి వెల్లడించాడు.
గౌతమ్ గంభీర్కు రవిశాస్త్రి సలహా
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన తర్వాత రవిశాస్త్రి స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ.."కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కఠినంగా వ్యవహకరించాలి. పదేపదే తప్పులు చేస్తున్న ఆటగాళ్లను ఓటమికి బాధ్యులను చేయాలి. అవసరమైతే హెడ్ కోచ్ ఆటగాళ్లను కూడా మందలించాలి." అని అన్నారు.

రవిశాస్త్రి మాట్లాడుతూ, "కోచింగ్ స్టాఫ్కు కూడా ఇందులో పెద్ద పాత్ర ఉందని నేను భావిస్తున్నాను. మ్యాచ్లోని సానుకూల అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో తన పాత్రకు మించి ప్రదర్శన ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ఐదు సెంచరీలు నమోదయ్యాయి, కానీ గెలవాలంటే మనం ప్రాథమిక అంశాలను మెరుగుపరచుకోవాలి. బ్యాటర్లు మైదానంలోకి వచ్చినప్పుడు తమ వికెట్కు ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు 500-600 పరుగులు చేసే స్థితిలో ఉంటే, జట్టు అవకాశాలను కోల్పోవడం సరికాదు. ఈ విషయాలలో హెడ్ కోచ్ కఠినంగా ఉండాలి. " అని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇందుకోసం డ్రెస్సింగ్ రూమ్లో కఠినత్వం చూపడం అవసరం అని సూచించారు.
లీడ్స్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి
తొలి టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసిన తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. బదులుగా ఇంగ్లండ్ 465 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 364 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి నాలుగో ఇన్నింగ్స్లో 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.