ముంబై: ఐపిఎల్ చీఫ్ గా వైదొలగేది లేదని లలిత్ మోడీ మొండిగా చెబుతున్నా ఆయనకు ఉద్వాసన పలకడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో కొత్త చీఫ్ ఎవరన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ రవిశాస్త్రి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. గత రెండు రోజులుగా రవిశాస్త్రి పేరు ఐపీఎల్ వర్గాల్లో నానుతోందని సమాచారం. బీసీసీఐలోని దాదాపు 60 శాతం మంది కీలక నేతలతో పాటు బోర్డు ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్ కూడా రవిశాస్త్రికే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్ పాలక మండలి సభ్యునిగా ఉన్నారు. మాజీ కెప్టెన్లు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, బీజేపీ నేత అరుణ్ జైట్లీ, నిరంజన్ షా పేర్లు కూడా పరిశీనలలో ఉన్నాయని సమాచారం. లీగ్ లోకి వస్తున్న నిధులపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని గత వారమే పటౌడీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు కెప్టెన్ల అభిప్రాయం, ఓటు కూడా సోమవారం జరగనున్న ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో కీలకం కానుంది.