రీఎంట్రీపై అనుమానాలు:
ఇటీవలే బీసీసీఐ 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించగా.. అందులోనూ ధోనీకి కాంట్రాక్ట్ని ఇవ్వలేదు. దీంతో మహీ మళ్లీ భారత్ జట్టు తరఫున ఆడటం అనుమానమేనంటూ వార్తలు వచ్చాయి. కొందరూ ధోనీ రీఎంట్రీ పక్కా అంటుంటే.. మరికొందరూ కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహీ భవితవ్యంపై రవిశాస్త్రి మరోమారు స్పందించాడు.
ఐపీఎల్ ప్రదర్శనతోనే భవితవ్యం తేలనుంది:
న్యూజిలాండ్తో తొలి టీ20 విజయానంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'ఐపీఎల్-13 సీజన్ ధోనీకి ఎంతో కీలకం. ఈ విషయం సెలెక్టర్లు, కెప్టెన్తో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. మహీ తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు. అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు కూడా ఏం నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేం. ఐపీఎల్కు సంబంధించి ప్రాక్టీస్ మొదలు పెట్టాడో లేదో తెలియదు. కానీ.. ఐపీఎల్లో మాత్రం కచ్చితంగా ఆడుతాడు. ఐపీఎల్లో ప్రదర్శనతోనే మహీ భవితవ్యం తేలనుంది. ఒకవేళ ఐపీఎల్లో తన ఆటతో మెప్పించలేకపోతే ధోనీనే తప్పుకుంటాడు' అని తెలిపాడు.
రంజీ జట్టుతో ప్రాక్టీస్:
బీసీసీఐ తనను కాంట్రాక్ట్ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. రంజీ జట్టుతో కలిసిన ధోనీ వైట్బాల్తో ఎక్కువగా ప్రాక్టీస్ చేసాడు. ఈ వార్తలను జార్ఖండ్ టీమ్ పెద్దలు కూడా ధృవీకరించారు. ఐపీఎల్ కోసమే ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలిపారు. ఝార్ఖండ్లోని ప్రసిద్ధ దేవాలయం 'డియోరి'లో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టినట్లు సమాచారం. ఇటీవలే ధోనీ డియోరి దేవాలయంకు వెళ్లి పూజలు చేసాడట.