ముంబై: టీమిండియా కోచ్ పదవి తనకు దక్కలేదనే అసంతృప్తితో ఉన్న మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ ఎంపిక కమిటీలో సభ్యుడైన సౌరభ్ గంగూలీ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. థాయ్లాండ్లో విహారం మాని నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చుగా అని తనను తప్పుపట్టిన సౌరభ్ గంగూలీపై రవిశాస్త్రి తాజాగా మరోసారి విమర్శలు గుప్పించాడు.
గంగూలీ ఇంటర్వ్యూ జరిగినపుడు లేకపోవడం ముమ్మాటికీ తప్పే అన్న రవిశాస్త్రి.. తాను ఏ స్థితిలో ముఖాముఖిలో నేరుగా పాల్గొనలేకపోయాడో వివరించాడు. జూన్ 21న ఇంటర్వ్యూ అని 19న తనకు బీసీసీఐ నుంచి సమాచారం వచ్చిందని, అయితే తాను జూన్ 15నే థాయ్లాండ్కు బయల్దేరిపోయానని తెలిపాడు.

' ఇంటర్వ్యూలు ఎప్పుడుంటాయని ఎవ్వరికీ తెలియదు. నేను దేశంలో లేను కాబట్టి స్కైప్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. టామ్ మూడీతో పాటు కొందరు ఇలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అయినా ఇందులో తేడా ఏముంటుంది? ఈ రోజుల్లో సగం వ్యవహారాలు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారానే నడుస్తున్నాయి' అని రవిశాస్త్రి అన్నారు.
అంతేగాక, 'కనీసం కమిటీలో ఉన్నవాళ్లు అక్కడుండాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని గౌరవించాలి. అలాగే తమకిచ్చిన కర్తవ్యాన్ని గౌరవించాలి' అని గంగూలీని ఉద్దేశించి రవిశాస్త్రి అన్నాడు.
మరోవైపు రవిశాస్త్రి, గంగూలీల తీరును బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తప్పుపట్టాడు. 'రవి, సౌరభ్ నాకు మంచి స్నేహితులు. ఇద్దరిపై క్రికెట్ వర్గాల్లో ఎంతో గౌరవం ఉంది. కానీ వీళ్లిద్దరూ ప్రస్తుతం పిల్లల్లా తగువులాడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేసి ముందుకెళ్తారని ఆశిస్తున్నా' అని షిర్కే పేర్కొన్నాడు.