IND VS ENG Test Series: ఐపీఎల్ 2025 అనంతరం భారత్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అక్కడ 5 టెస్ట్ మ్యాచుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ టూర్ కోసం ఎంపికయ్యే జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై క్రికెట్ అభిమానుల్లో, మాజీ క్రికెటర్ల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగుతోన్న సాయి సుధర్శన్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
అయితే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శుభ్మన్ గిల్.. ఈ ముగ్గురు ఓపెనర్లుగా ఉండే అవకాశం ఉంది. రోహిత్ కన్ఫామ్ అయితే, అతడు జైశ్వాల్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. అప్పుడు గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అంటే ఈ పరిస్థితుల్లో సాయి సుధర్శన్కు అవకాశం రావడం కష్టమే. అయినా కూడా బ్యాకప్గా సాయి సుదర్శన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. "యువ ఆటగాడు సాయి సుధర్శన్ అన్ని ఫార్మాట్లలోనూ భారత్ తరఫున ఆడగలడని నాకు నమ్మకం ఉంది. అతడు అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. క్లాస్ ప్లేయర్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం, అక్కడి కండిషన్లపై అతడికి అవాగాహన ఉండటం, అలానే అతడి టెక్నిక్ ఆట తీరు - ఇవన్నీ అతడికి టెస్ట్ జట్టులో అవకాశం కల్పించొచ్చు. నా దృష్టిలో అతడు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాడు." అని చెప్పుకొచ్చాడు.
కాగా, ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుధర్శన్ 456 పరుగులు చేశాడు. అందులో 5 అర్ధ శతకాలు ఉన్నాయి. అదే జట్టుకు చెందిన జాస్ బట్లర్ 406 పరుగులు, శుభ్మన్ గిల్ 389 పరుగులు చేశారు.
అలానే 2023, 2024లో సర్రె తరఫున కౌంటీ ఛాంపియన్షిప్లో సాయి ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ పిచ్ లపై ఆడిన అనుభవం అతడికి ఉంది. అక్కడ ఆడిన ఐదు మ్యాచ్ల్లో 281 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇకపోతే మొత్తం 29 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో బ్యాటింగ్ సగటు 39.93తో సాయి సుధర్శన్ 1957 పరుగులు చేశాడు. 2024-25 రంజీ ట్రోఫీలో ఢిల్లీపై డబుల్ సెంచరీ చేశాడు.