ద్వైపాక్షిక టీ20 సిరీస్లు తగ్గించి ఫ్రాంచైజీ క్రికెట్ను ప్రోత్సహించాలని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐసీసీ తదుపరి ఫ్యూచర్స్ టూర్స్ & ప్రోగ్రామ్ (FTP) డ్రాఫ్ట్ ప్రకారం.. టీ20 మ్యాచ్ల సంఖ్య పెరగడంతో పాటు ఐపీఎల్ కోసం రెండున్నర నెలల ప్రత్యేక విండో ఉండబోతుంది. దీంతో పెరుగుతున్న మ్యాచ్ల సంఖ్య వల్ల మల్టీ-ఫార్మాట్ ఆటగాళ్లు తీవ్ర భారాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇటీవల ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ సోమవారం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల స్టోక్స్.. మూడు ఫార్మాట్లలో ఆడటం తన వల్ల కావట్లేదని చెప్పిన సంగతి తెలిసిందే.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'నేను ముఖ్యంగా టీ20 క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నా. ఇండియా, వెస్టిండీస్, పాకిస్తాన్ ఇలా ఏ దేశంలోనైనా ఫ్రాంచైజీ క్రికెట్కు విపరీతమైన ఆదరణ ఉంది. అందువల్ల తక్కువ ద్వైపాక్షిక టీ20సిరీస్లు నిర్వహించాలనేది నా అభిప్రాయం. ఎలాగూ ఐసీసీ ప్రపంచకప్ కోసం అన్ని జట్లు ఆడతాయి.. కాబట్టి వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లకు ప్రాధాన్యం ఇచ్చి.. ద్వైపాక్షిక (రెండు దేశాల మధ్య) సిరీస్లకు ప్రాధాన్యం తగ్గించాలి. ఎలాగూ ప్రజలు ఐసీసీ టోర్నీల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు అని రవిశాస్త్రి చెప్పాడు.
'టెస్ట్ల విషయంలోనూ రెండు అంచెల విధానం అవసరమని తాను భావిస్తున్నట్లు రవివాస్త్రి తెలిపాడు. లేకుంటే టెస్ట్ క్రికెట్ 10 సంవత్సరాలలో కాలగర్భంలో కలిసిపోతుందన్నాడు. అగ్రస్థానంలో ఉన్న ఆరు జట్ల మధ్య టెస్ట్లు జరగాలని, రెండో అంచెలో మరో ఆరు టెస్ట్ జట్లు పోటీ పడాలని తద్వారా క్వాలిటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ పెరుగుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తక్కువ ద్వైపాక్షిక టీ20 సిరీస్లు నిర్వహించి ఫ్రాంచైజీ క్రికెట్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని.. తద్వారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ మనుగడకు అవకాశం ఉంటుందని'రవిశాస్త్రి వివరించాడు.