
రవిశాస్త్రికే పట్టం
సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) రవిశాస్త్రి పేరును సూచించగా, అందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సీఏసీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించాకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అనిల్ కుంబ్లే స్ధానంలో రవిశాస్త్రి కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

2019 వరల్డ్ కప్ వరకు
2019 వరల్డ్ కప్ వరకు టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి కొనసాగనున్నాడు. టీమిండియా కోచ్ రేసులో ఉన్న ఐదుగురిని రవిశాస్త్రి వెనక్కి నెట్టాడు. అంతేకాదు కోచ్ నియామకంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మాటను నెగ్గించుకున్నాడు. లంక పర్యటనతో రవిశాస్త్రి తన బాధ్యతల్ని చేపట్టే అవకాశం ఉంది.

2014-16 మధ్యకాలంలో రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్గా
1981-92 వరకు రవిశాస్త్రి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 2014-16 మధ్యకాలంలో రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్గా పనిచేశాడు. టీమిండియా డైరెక్టర్గా రవిశాస్త్రి పని చేసిన సమయంలో ఆస్ట్రేలియాలో తొలిసారి పరిమిత ఓవర్ల సిరీస్ను ఖాతాలో వేసుకుంది. టీ20 సిరీస్ను 3-0తో గెలిచింది.

టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు కూడా
దీంతో పాటు టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని కూడా సొంతం చేసుకుంది. 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్ల్లో సెమీ ఫైనల్ వరకు చేరుకుంది. టీమిండియా డైరెక్టర్గా సుమారు రెండేళ్ల పాటు ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ని పంచుకున్నాడు. కోచ్కి ముందు కామెంటేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు.

వినోద్ రాయ్ ఆదేశం మేరకే
ఇదిలా ఉంటే మంగళవారం బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ కోచ్ ప్రకటనను వాయిదా వేయడాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రంలోగా కోచ్ పేరును వెల్లడించాలని ఆయన బీసీసీఐని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ రవిశాస్త్రి పేరుని ప్రకటించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











