విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించడం, సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. భారత యువ ఆటగాళ్లకు లక్కీ ఛాన్స్ వచ్చింది. జింబాబ్వే పర్యటనకు శుభ్మన్ గిల్ నేతృత్వంలో యువకులు వెళ్లారు. కానీ తొలి టీ20లో అనూహ్య ఫలితం. అయిదు టీ20ల సిరీస్లో భాగంగా హరారె వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 115 పరుగులు చేసింది. మడాండే (29 నాటౌట్; 25 బంతుల్లో 4×4) టాప్స్కోరర్. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ (4/13) నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ (2/11) రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (31; 29 బంతుల్లో, 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (27; 34 బంతుల్లో; 1 ఫోర్, 1 సిక్సర్) మినహా ఎవరూ సత్తాచాటలేదు. సికిందర్ రజా (3/25), చటార (3/16) మూడు వికెట్లతో సత్తాచాటారు.

అయితే మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఓటమికి గల కారణాలు వివరించాడు. ఛేదనలో భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. సీనియర్లు రిటైర్మెంట్ ఇచ్చారని, జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమపై ఉందని అన్నాడు. ఆదివారం జరగనున్న రెండో టీ20లో గొప్పగా పుంజుకుంటామని తెలిపాడు.
''ఇది కొత్త ఆటగాళ్ల సమయం. సీనియర్ ప్లేయర్లు రిటైర్ అయ్యారు. బాధ్యతలు మాకు అందించారు. జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాగుంది. బౌలింగ్ మార్పు చక్కగా చేస్తున్నాడు. మంచి కెప్టెన్సీకి ఇది సూచిక. ఇక తొలి టీ20లో గట్టి ప్రయత్నమే చేశాం. ఫ్రెష్ మైండ్తో ఆదివారం జరిగే రెండో టీ20లో పుంజుకుని తిరిగి సత్తాచాటుతాం''
''తొలి మ్యాచ్లో మేం ఆలౌటయ్యాం. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయాం. ఓ భాగస్వామ్యం నెలకొల్పి ఉంటే మ్యాచ్ మావైపు తిరిగేది. కానీ అలా పార్టనర్షిప్ సాధించలేకపోయాం. ఇదే ఫలితాన్ని నిర్దేశించింది. జింబాబ్వే బౌలింగ్,ఫీల్డింగ్ బాగుంది. మమ్మల్ని భాగస్వామ్యాలను నెలకొల్పకుండా కట్టడిచేశారు'' అని రవి బిష్ణోయ్ అన్నాడు.