ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లి అని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. యూట్యూబ్ షోలో పాల్గొన్న అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అజామ్ను పాకిస్థాన్ జట్టు నుంచి తప్పించడంపై జరిగిన చర్చలో విరాట్ కోహ్లి పేరును ప్రస్తావించగా.. అశ్విన్ చాలా సీరియస్ అయ్యాడు. దయచేసి బాబర్ అజామ్తో కోహ్లిని పోల్చవద్దని విజ్ఞప్తి చేశాడు.
ప్రపంచ మేటి క్రికెటర్ విరాట్ కోహ్లి అని, అతను సాధించిన ఘనతలను ఏ క్రికెటర్ సాధించలేదని అశ్విన్ అన్నాడు. రన్ మెషిన్ కోహ్లి స్థాయి వేరు అని, బాబర్ అజామ్ను తాను తక్కువగా చేసినట్లు కాదని అన్నాడు. బాబర్ మంచి ప్లేయర్ అని, అయితే కోహ్లితో మాత్రం పోలిక వద్దని తెలిపాడు. విరాట్ చేసిన విధ్వంసాలు, అన్ని వేళలో, ఒత్తిడిలో అతను చేసిన ఘనతలు ప్రపంచ క్రికెట్లో మరెవరూ చేయలేదని అశ్విన్ పేర్కొన్నాడు.

దీని గురించి చర్చ ఆపేయాలని అశ్విన్ అన్నాడు. ఇక రెండో స్థానం ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ది అని పేర్కొన్నాడు. టెస్టుల్లో రూట్ సూపర్ ఫామ్లో ఉన్నాడని, ఈ ఫార్మాట్లో కోహ్లికి రూట్ దగ్గరలో ఉన్నాడని తెలిపాడు. కాగా, ఇంగ్లండ్తో రెండు, మూడు టెస్టులకు బాబర్ అజామ్ను జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ ప్రధాన బ్యాటర్ బాబర్ను జట్టు నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పాక్ క్రికెటర్లు, మాజీలు,విదేశీ మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్.. విరాట్ కోహ్లిని, భారత్ను ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్పై పీసీబీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. వారం రోజుల్లో పోస్ట్ గురించి వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
2020 నుంచి 2023 మధ్య కాలంలో విరాట్ కోహ్లి 19.33, 28.21, 26.50 సగటుతో ఉన్నప్పటికీ , అతనని భారత్ బెంచ్కు పరిమితం చేయలేదని ఫకర్ జమాన్ అన్నాడు. కానీ ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్ను తొలగించాలనే నిర్ణయం, జట్టులో ప్రతికూల సందేశాన్ని పంపుతుందని ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానెల్లో చర్చలో పాల్గొన్న ఓ వ్యక్తి బాబర్ అజామ్కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని, విరాట్ కోహ్లికి బీసీసీఐ మద్దతు ఇచ్చినట్లుగా పాక్ బోర్డు నిలబడాల్సిందని వ్యాఖ్యానించాడు. దీనిపై అశ్విన్ మండిపడ్డాడు. కోహ్లి స్థాయిని వివరించాడు.