

హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాడు రసిఖ్ దార్పై ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ 17 ఏళ్ల యువ పేసర్కు ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లోనే రసిఖ్ దార్కు అవకాశం ఇవ్వడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ "అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. నెట్స్లో అతని బౌలింగ్ తీరు మా జట్టు సభ్యుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రధానంగా బంతిని స్వింగ్ చేసే విధానం అమోఘం. అందుచేత అతనికి తొలి మ్యాచ్లో అవకాశం ఇవ్వాలనుకున్నారు. అందుకు తగ్గట్టే మ్యాచ్లో కూడా రసిఖ్ ఆకట్టుకున్నాడు" అని అన్నాడు.
"రసిఖ్ కోటా పూర్తి చేసే క్రమంలో వేసిన చివరి రెండు బంతులు మినహా మిగతా అంతా అతని బౌలింగ్ చాలా బాగుంది. ఒత్తిడిలో కూడా నిలకడైన బౌలింగ్ చేశాడు. అతను రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో ఒక ప్రత్యేక బౌలర్గా అందరి మన్ననలు అందుకుంటాడు" అని యువరాజ్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్లోనే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) నిరాశపరిచాడు.
ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డికాక్ (27) కూడా ఔటడంతో ముంబై 45/3తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్లో యువరాజ్(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్యా (0) కూడా ఔటవడంతో మ్యాచ్పై ముంబై పట్టుజారింది.
దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసి 37 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రసిఖ్ దార్ నాలుగు ఓవర్లు వేసి 42 పరుగులిచ్చాడు.