ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన రిటైర్మెంట్ గురించి చేసిన ప్రకటన క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన అనంతరం రషీద్ ఖాన్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు వెల్లడించాడు.
వెన్నునొప్పితో బాధపడుతున్న రషీద్ ఖాన్
రషీద్ ఖాన్ గత కొంతకాలంగా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఆయన సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఆపరేషన్ తర్వాత మళ్లీ మైదానంలోకి తిరిగి వచ్చినప్పటికీ.. సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల వెన్నుపై విపరీతమైన భారం పడుతోందని రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా చాలా ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల తన కెరీర్కే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.

వైద్యుల సలహా మేరకే..
వైద్యుల సలహాను పట్టించుకోకుండా గతంలో జింబాబ్వేతో జరిగిన టెస్టులో 67 ఓవర్లు బౌలింగ్ చేశానని.. అది తన వెన్నుపై తీవ్ర ప్రభావం చూపిందని రషీద్ ఖాన్ వివరించాడు. "నువ్వు ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలనుకుంటే రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉండాలి" అని డాక్టర్లు స్పష్టంగా చెప్పినట్లు ఆయన వెల్లడించాడు. అందుకే తన కెరీర్ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకు పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డేలు, టీ20లు) పైనే పూర్తి దృష్టి సారించాలని రషీద్ ఖాన్ నిర్ణయించుకున్నాడు.
భారత్తో జరిగే టెస్ట్ మ్యాచ్కు దూరం
అఫ్గాన్ జట్టు టెస్ట్ హోదా పొందినప్పటి నుంచి ఇప్పటివరకు ఆడిన 12 టెస్టుల్లో రషీద్ ఖాన్ కేవలం 6 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. 2026 జూన్లో భారత్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కు కూడా ఆయన అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఏడాది ఓ టెస్ట్ మ్యాచ్ అయితే ఆడగలనేమో కానీ.. అంతకంటే ఎక్కువ భారాన్ని తన శరీరం మోయలేదని రషీద్ ఖాన్ స్పష్టం చేశాడు. మొత్తానికి వైట్ బాల్ క్రికెట్లో మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని రషీద్ ఖాన్ ప్రకటించాడు.