
హైదరాబాద్: టీ20 క్రికెట్లో ఆఫ్ఘనిస్థాన్ లెగ్స్పిన్నర్ రషీద్ ఖాన్ హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్తో ముగిసిన మూడు మ్యాచ్ల సిరిస్లో 12 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్ మొత్తంగా 813 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
రషీద్ఖాన్ తన కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్నాడు. బంగ్లాదేశ్ సిరిస్లో రషీద్ ఖాన్ ఏకంగా 54 రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నాడు. దీంతో రెండో ర్యాంక్లో ఉన్న పాకిస్థాన్ స్పిన్నర్ షాదాబ్ఖాన్(733)తో 80 పాయింట్ల తేడా ఏర్పడింది.
ఆప్ఘన్కు చెందిన మరో స్పిన్నర్ మహ్మద్ నబీ కెరీర్లోనే అత్యుత్తమంగా 8వ ర్యాంకులో నిలవగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 62వ ర్యాంకును సాధించాడు. బంగ్లాతో సిరీస్లో 118 పరుగులతో రాణించిన సమీవుల్లా షెన్వారీ 11 ర్యాంక్లు మెరుగుపరచుకుని 44వ ర్యాంక్లో నిలిచాడు.
బంతిని మంచి లెంగ్త్లో వేయడం వల్లే తాను విజయవంతమవుతున్నానని రషీద్ ఖాన్ తెలిపాడు. తన నంబర్ వన్ ర్యాంకుపై రషీద్ ఖాన్ మాట్లాడుతూ 'నా నైపుణ్యాలను ఎప్పుడూ నమ్ముతూనే ఉంటా. ఏదేమైనా కానీ మంచి లెంగ్త్ ప్రాంతంలో బంతిని వేయాలనేదే నా ప్రణాళిక. లెగ్స్పిన్ కానీ గూగ్లీ కానీ మంచి లెంగ్త్లో వేయాలని చూస్తా' అని అన్నాడు.
'అలా చేయడమే నా విజయ రహస్యం. ఫిట్గా ఉంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించవచ్చు. అందుకే నేను ఫిట్నెస్ మీద ప్రత్యేక దృష్టి సారించా. లీగైనా అంతర్జాతీయ మ్యాచ్ అయినా క్రికెట్ ఆడడాన్ని ఆస్వాదిస్తా. మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్. మీ కోసం ఇలాగే విజయాలు సాధిస్తాం' అని తెలిపాడు.