
హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ను అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అని అందరూ పిలుస్తుంటే.. తాను మాత్రం మణికట్టు కంటే ఎక్కువగా వేళ్ల కొనలతోనే బంతిని తిప్పుతానని అంటున్నాడు. ఇలా వేలి కొనలతో బంతిని తిప్పడం వల్ల వేగంగా విసిరే అవకాశం ఉంటుందని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా ఇండియా, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య చారిత్రాత్మక ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రషీద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ "వన్డే, టీ20లతో పోలిస్తే టెస్టు క్రికెటర్గా ఎంతో భిన్నంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది" అని చెప్పాడు.
"నిజానికి లెగ్ స్పిన్ ఎలా వేయాలో నాకెవరూ చెప్పలేదు. ఆ అవకాశం కూడా నాకు లేదు. కాకపోతే ఐదారేళ్ల క్రితం షాహిద్ అఫ్రిది, అనిల్ కుంబ్లేల వీడియోలను చూసేవాణ్ని. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో కుంబ్లే బౌలింగ్ వీడియోలను చూస్తుంటా" అని రషీద్ ఖాన్ తెలిపాడు.
"లెగ్ స్సిన్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతా. ఎక్కువగా మణికట్టును ఉపయోగించను. వేళ్లతోనే బంతిని తిప్పడానికి యత్నిస్తా. ఒక లెగ్స్పిన్నర్ ఇలా బౌలింగ్ వేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది' అని రషీద్ ఖాన్ తెలిపాడు.
"నేను భయపడటం లేదు. టెస్టు క్రికెట్లో 20 ఓవర్ల పాటు వికెట్ లభించదని తెలుసు. కానీ నేను మాత్రం రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసేందుకే ప్రయత్నిస్తా. ఎందుకంటే టెస్టు క్రికెట్లో ఓపిక అవసరం. ఒకానొక సమయంలో వికెట్ తీయకుండానే సెషన్ ముగించాల్సి వస్తుంది' అని పేర్కొన్నాడు.
"గతేడాది ఐపీఎల్ సీజన్ ముగిశాక ఇంటికెళ్లినప్పుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం నన్నెంతో ఆకట్టుకుంది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని రషీద్ చెప్పాడు. ఒంటరిగా అనిపించినప్పుడు పడుకోవడానికి ప్రయత్నిస్తాను. గ్రీన్ టీ తాగి రిలాక్స్ అవుతా. ఇంకేం చేయను" అని చెప్పాడు.