SL vs AFG: ఆసియా కప్ 2025లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్ లో ఓటమి అనంతరం అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. అఫ్గానిస్తాన్ జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ తమ బౌలర్లు మ్యాచ్లో తేలిపోయారని అంగీకరించాడు. అయితే జట్టులో బ్యాటర్ మహ్మద్ నబీ ఆడిన తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
మహ్మద్ నబీ బ్యాటింగ్పై ప్రశంసలు
అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. "మేము ఇన్నింగ్స్ను ముగించిన తీరు చాలా ప్రత్యేకం. ఒక స్పిన్నర్ ఓవర్ మిగిలి ఉందని, మంచి బ్యాటర్ క్రీజ్లో ఉంటే భారీ పరుగులు సాధించగలమని మాకు తెలుసు. నబీ అదే చేశాడు. చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించాడు." అని రషీద్ ఖాన్ నబీని ప్రశంసించాడు.

బౌలింగ్ వైఫల్యంపై తీవ్ర నిరాశ
రషీద్ ఖాన్ తమ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్లో వైఫల్యమే అని స్పష్టం చేశాడు. "మేము బౌలింగ్లో సరిగ్గా రాణించలేదు. అందుకే గెలవలేకపోయాం. ఈ పిచ్ మామూలు స్పిన్నింగ్ వికెట్ కాదు, దుబాయ్లో ఉన్న పిచ్తో పోలిస్తే భిన్నంగా ఉంది. అయినప్పటికీ 170-180 పరుగులను ఛేదించడం సాధ్యమే. కానీ, మా బౌలింగ్లో లోపాలు ఉన్నాయి." అని వివరించాడు. గత మ్యాచ్లో 150 పరుగులు కూడా ఛేదించలేకపోయామని గుర్తుచేసుకున్నాడు.
భవిష్యత్తుపై ఆశలు
టోర్నీ నుంచి నిష్క్రమించడంపై రషీద్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. గత మూడేళ్లుగా తాము ఐసీసీ, ఆసియా కప్ వంటి టోర్నీలలో బాగానే ఆడుతున్నామని, గత టీ20 ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చేరుకున్నామని, కనీసం ఈసారి తదుపరి రౌండ్కు వెళ్తామని ఆశించానని అన్నాడు. "మేము దీని గురించి ఆలోచించుకోవాలి, విశ్లేషించుకోవాలి, బలంగా తిరిగి రావాలి" అని రషీద్ ముగించాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకుని, భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన ఇస్తామని రషీద్ హామీ ఇచ్చాడు.
సూపర్-4కు శ్రీలంక.. బంగ్లాదేశ్కు లక్కీ ఛాన్స్
ఆసియా కప్ 2025లో భాగంగా నువాన్ తుషారా అద్భుతమైన బౌలింగ్ , ఆ తర్వాత కుశాల్ మెండిస్ అద్భుతమైన అర్ధ సెంచరీతో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించింది. ఈ విజయంతో, ఆసియా కప్లో శ్రీలంక సూపర్-4లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఓటమి బంగ్లాదేశ్కు ప్రయోజనం చేకూర్చింది. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు సూపర్-4కు అర్హత సాధించింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ నబీ ఆఖరి ఓవర్లో వీరవిహారం చేశాడు. తన అనుభవాన్ని రంగరించి, వరుస సిక్సర్లతో జట్టు స్కోరును అమాంతం పెంచాడు. అయితే, ఆఫ్ఘన్ బౌలర్లు ఈ స్కోరును కాపాడుకోలేకపోయారు. శ్రీలంక 18.4 ఓవర్లలో 171 పరుగులు చేసి మ్యాచ్ను గెలుచుకుంది.