ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండడంతో ఏ ఆటగాడిని ఏ ప్రాంచైజీ కొనగోలు చేయబోతుందనే ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు ఏ ఏ జట్టుకు ఆడనున్నారనే వార్తలు వైరల్గా మారుతున్నాయి. అయితే కొత్త జట్లైనా అహ్మదాబాద్, లక్నో వేలానికి ముందే ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. ఇందుకు ఆయా జట్లకు గడువు కూడా విధించింది. దీంతో ఆయా జట్లు ఆటగాళ్లను ఎంచుకునే పనిలో పడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆప్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖానును అహ్మదాబాద్ ప్రాంచైజీ రిటైన్ చేసుకుందని తెలుస్తోంది.
అంతకుముందు రషీద్ లక్నో తరఫున ఆడనున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఐపీఎల్లో ఇంతకాలం సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రషీద్ ఖాన్ నిలకడగా రాణించాడు. ఈ ఏడాది కూడా రషీద్ ఖాన్ను రిటైన్ చేసుకునేందుకు రైజర్స్ ఆసక్తి చూపినప్పటికీ వేలంలోకి వెళ్లడానికే అతడు ఆసక్తి కనబరిచాడు. దీంతో రషీద్ను రైజర్స్ వేలంలోకి వదిలేసింది.
అలాగే ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా అహ్మదాబాద్ తరఫున ఆడనున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా హార్ధిక్ పాండ్యాను అహ్మదాబాద్ జట్టు తమ కెప్టెన్గా నియమించుకోనుందని సమాచారం. అయితే లోకేష్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ను లక్నో ప్రాంచైజీ రిటైన్ చేసుకోనుందని తెలుస్తోంది. అదే సమయంలో వేలంలో శ్రేయస్ అయ్యర్ కోసం ప్రయత్నించాలని ముంబై ఇండియన్స్ భావిస్తోందట. అతడిని ముంబై జట్టులో రోహిత్ శర్మ వారసుడిగా తీర్చిదిద్దాలని ఆ జట్టు యాజమాన్యం కసరత్తులు చేస్తోందని సమాచారం.
సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కోసం వేలంలో గట్టిగా ప్రయత్నించాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భావిస్తోందట. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం ఆ స్థానం కోసం బెంగళూరు జట్లులో ఖాళీ ఉంది. దీంతో వార్నర్తో కెప్టెన్సీ స్థానాన్ని భర్తీ చేయాలని బెంగళూరు యాజమాన్యం భావిస్తోందట.
కాగా ఐపీఎల్ మెగా వేలాన్ని బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో నిర్వహించనున్నట్లు లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఐపీఎల్ వేదికపై సందిగ్దం నెలకొంది. భారత్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో లీగ్ను విదేశాలకు తరలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముంబైలో నిర్వహించాలని మొదట భావించినప్పటికీ అక్కడ కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో లీగ్ నిర్వహణ సాధ్య పడడం కష్టంగానే మారింది. దీంతో సౌతాఫ్రికా, యూఏఈ, శ్రీలంకలో ఏదో ఒక వేదికలో ఐపీఎల్ను నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తుందని సమాచారం.