బంతితో రషీద్ మాయ:
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన పీఎస్ఎల్ 2021 యూఏఈ వేదికగా బుధవారం (జూన్ 9) పునఃప్రారంభం అయింది. 15వ మ్యాచులో భాగంగా షేక్ జాయెద్ స్టేడియంలో లాహోర్ ఖాలందర్స్ మరియు ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడ్డాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బ్యాట్స్మన్ ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. జేమ్స్ ఫాల్కనర్, అహ్మద్ దానియల్, హరిస్ రౌఫ్, రషీద్ ఖాన్ చెలరేగడంతో ఇస్లామాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా 18, కోలిన్ మున్రో 11, షాబాద్ ఖాన్ 7 , ఇఫ్తికార్ అహ్మద్ 12 విఫలమయ్యారు. చివరలో ఫహీమ్ అష్రాఫ్ 27 పరుగులతో జట్టుకు పోరాడే స్కోర్ అందించాడు. రషీద్ 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
శుభారంభం దక్కలేదు:
మోస్తరు లక్ష్య ఛేదనలో లాహోర్ ఖలందర్స్ జట్టుకు శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ ఫకర్ జమాన్ 15 బంతుల్లో 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆపై ముహమ్మద్ ఫైజాన్ (9) కూడా నిరాశపరిచాడు. అయితే మొహ్మద్ హఫీజ్ (29) అండతో మరో ఓపెనర్, కెప్టెన్ సోహైల్ అక్తర్ (40) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు పెవిలియన్ చేరడంతో.. రన్ రేట్ తగ్గిపోయింది. గాయపడిన బెన్ డంక్ 18 బంతుల్లో 17 పరుగులే చేశాడు. టీమ్ డేవిడ్ ధాటిగా ఆడడంతో లాహోర్ జట్టు స్కోర్ 120 దాటింది.
5 బంతుల్లో 15 రన్స్:
ఇక చివరి ఓవర్లో లాహోర్ ఖలందర్స్ జట్టు విజయానికి 16 రన్స్ అవసరం అయ్యాయి. క్రీజులో ఉన్నది స్పెసలిస్ట్ బ్యాట్స్మన్ కాకపోవడంతో లాహోర్ ఓటమి ఖాయం అనుకున్నారు అందరూ. ఇక్కడే రషీద్ ఖాన్ తన విష్వరూపం ప్రదర్శించాడు. హుస్సేన్ తలట్ వేసిన తొలి మూడు బంతులను హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. దీంతో సమీకరణం 3 బంతుల్లో 4 పరుగులుగా మారింది. నాలుగో బంతికి 2 రన్స్ చేసిన రషీద్.. ఐదవ బంతికి సింగల్ తీశాడు. ఇక చివరి బంతికి టీమ్ డేవిడ్ సింగల్ తీయడంతో లాహోర్ ఊహించని విజయాన్ని అందుకుంది. రషీద్ 5 బంతుల్లో 15 రన్స్ చేశాడు. బంతి, బ్యాటుతో మెరిసిన అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
కెప్టెన్సీ భారం కాకూడదని:
అఫ్గానిస్థాన్ టీ20 జట్టుకు సారథ్యం వహించే అవకాశాన్ని రషీద్ ఖాన్ ఇటీవల వదులుకున్నాడు. కెప్టెన్సీ భారం తన ఆటపై ఏమాత్రం ప్రభావం చూపకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ ఏడాది భారత గడ్డపై అక్టోబరు-నవంబరు టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఈ మేరకు జట్టు సన్నద్ధతలో భాగంగా కెప్టెన్సీ బాధ్యతల్ని రషీద్ ఖాన్కి ఇవ్వాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆశించింది. కానీ రషీద్ మాత్రం అఫ్గానిస్థాన్ బోర్డు విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం తెలుస్తోంది.