
హైదరాబాద్: అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ ఆఖరి ఓవర్లో మరో సారి అద్భుతం సృష్టించాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్మన్ను రనౌట్ చేసి జట్టుకు విజయాన్నందించాడు. దీంతో అఫ్ఘనిస్థాన్తో టీ20 మ్యాచ్కు తలపడిన బంగ్లాదేశ్కు వైట్ వాష్ తప్పలేదు. గురువారం డెహ్రాడూన్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరముంది. ఆ దశలో బౌలింగ్కు దిగిన రషీద్.. 7 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
మహ్మదుల్లా రనౌట్ కావడంతో అప్ఘానిస్థాన్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. డెహ్రాడూన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. బదులుగా బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (37 బంతుల్లో 46 పరుగులు)ను చివరి ఓవర్ తొలి బంతికి ఔట్ చేసిన రషీద్ ఒత్తిడి పెంచాడు.
ఆఖరి బంతికి 4 రన్స్ అవసరమైన దశలో మహ్మదుల్లా (38 బంతుల్లో 45) రెండు రన్స్ చేసి రనౌటయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో అప్ఘాన్ గెలుపొందింది. మహ్మదుల్లా, ముష్ఫికర్ 84 పరుగుల భాగస్వామ్యం రషీద్ బౌలింగ్ దాడి ముందు వెలవెలబోయింది. ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్లలో రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 16 ఓవర్లో ఏడు పరుగులు ఇచ్చిన ఈ యువ స్పిన్నర్, 18వ ఓవర్లో 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లోనూ 7 పరుగులే ఇచ్చాడు.
చివరి ఐదు ఓవర్లలో విజయానికి 55 పరుగులు అవసరం కాగా.. 17, 19 ఓవర్లలో బంగ్లా బ్యాట్స్మెన్ 36 పరుగులు చేశారు. కానీ రషీద్ బౌలింగ్ను ఎదుర్కోలేక ఆ జట్టు ఓటమిపాలైంది. టోర్నీలో రషీద్ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీసి బౌలింగ్ చార్ట్లో టాప్ స్థానానికి చేరుకున్నాడు. సిరీస్ మొత్తానికి టాప్గా నిలవడంతో అతనికి మాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.