అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 ఇంటర్నేషనల్స్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డును నెలకొల్పి తన పేరును క్రికెట్ చరిత్రలో సుపర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. యూఏఈతో షార్జా వేదికగా జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు.
మ్యాచ్లో అఫ్గానిస్థాన్ మెరుపులు
ఈ మ్యాచ్లో అఫ్గానిస్థాన్ అద్భుతమైన ప్రదర్శనతో యూఏఈపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్(63 పరుగులు), సెధిఖుల్లా అటల్(54 పరుగులు) మెరుపు అర్థ సెంచరీలతో జట్టుకు బలమైన పునాది వేశారు. అటల్కు ఇది టీ20 ఇంటర్నేషనల్స్లో తొలి అర్థ సెంచరీ కావడం విశేషం.

రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం
189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈ జట్టు 150 పరుగులకే పరిమితమైంది. యూఏఈ కెప్టెన్ మహమ్మద్ వసీం 67 పరుగులతో ప్రతిఘటించినా.. రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం ముందు మిగతా బ్యాటర్లు నిలబడలేకపోయారు. రషీద్ ఖాన్ కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు వికెట్లతో రషీద్ ఖాన్ తన కెరీర్ మొత్తం వికెట్ల సంఖ్యను 165కి చేర్చాడు. దీంతో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌతీ(164 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టి టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. రషీద్ ఖాన్ ఈ ఘనతను కేవలం 98 మ్యాచ్ల్లోనే సాధించడం విశేషం. టిమ్ సౌతీ తన 164 వికెట్లను 126 మ్యాచ్లలో తీశాడు.
ఈ విజయం ట్రై-సిరీస్లో అఫ్గానిస్థాన్కు ఎంతో కీలకం. తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన అఫ్గానిస్థాన్, ఈ గెలుపుతో సిరీస్లో తిరిగి పుంజుకుంది. ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్ ఇప్పటికే రెండు విజయాలు సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో అఫ్గానిస్థాన్, యూఏఈలో ఒక జట్టు తలపడనుంది. రషీద్ ఖాన్ తన అద్భుతమైన ప్రతిభతో అఫ్గానిస్థాన్ క్రికెట్కు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు తీసుకొస్తున్నాడు. ఈ రికార్డు అతని కెరీర్లో మరో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది.