
బర్మింగ్హామ్: ప్రపంచకప్ టోర్నమెంట్లో నిలవాలన్నా, సెమీఫైనల్లో చోటు దక్కించుకోవాలన్నా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఉన్న ఏకైక మార్గం.. ఇంగ్లండ్ ఓడిపోవడం. దానికి మించి మరే ప్రత్యామ్నాయమూ ఆ జట్టుకు లేదు. ఈ పరిస్థితుల్లో తన అడుగు ముందకు పడాలీ అంటే.. ఇంగ్లండ్ ఓడిపోవాలి. పైగా ఇంగ్లండ్ జట్టు.. బలమైన టీమిండియా ను ఎదుర్కొంటోంది. టీమిండియా చేతిలో ఇంగ్లండ్ గనక ఓడిపోతే.. తనకు ఇక ఎదురు ఉండదు అనేది పాకిస్తన్ టీమ్ భావన. అందుకే- ఆ జట్టు ఒక్కటే కాదు, దాన్ని అభిమానించే వాళ్లు సైతం భారత జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ అంశం టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందట. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొన్నారు. తమ జట్టు గెలవాలని పాకిస్తాన్ కోరుకోవడమేంటని నోరెళ్లబెట్టాడు. ఇది ఓ అరుదైన సందర్భమని ఆయన వ్యాఖ్యానించారు. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఇంగ్లండ్తో మ్యాచ్ ఆరంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు.
అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయని అన్నారు. అయినప్పటికీ.. పాకిస్తాన్ సైతం తమ విజయాన్ని కోరుకుంటుండటం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే.. బయట ఏం జరుగుతున్నదో తనకు తెలియదని, పాకిస్తాన్ తమకు మద్దతు ఇస్తున్న విషయం మీడియా చెబితేనే తనకు తెలిసిందని అన్నారు. సెమీఫైనల్లో చేరడానికి తాము ఎలాంటి సమీకరణాల గురించి పట్టించుకోవట్లేదని, నేరుగా దూసుకెళ్తామని చెప్పారు. మరొకరి జట్టు జయాపజయాలపై తాము ఆధారపడి లేమని వ్యాఖ్యానించారు కోహ్లీ.