హైదరాబాద్: పాకిస్థాన్ దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్న కొద్ది మంది సిక్కు క్రికెటర్లలో ఒకడిగా మహీందర్ పాల్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. 21 ఏళ్ల మహీందర్ పాల్ సింగ్ అనే యువకుడు కాండీలాండ్ తరఫున పాక్ దేశవాళీ టోర్నీ పాట్రన్స్ ట్రోఫీ గ్రేడ్-2 టోర్నీలో మంగళవారం పాల్గొన్నాడు.
కరాచి పోర్టు ట్రస్ట్ జట్టుపై తొలి మ్యాచ్ ఆడిన మోహిందర్ పాల్ సింగ్ ఆ మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు. అయితే గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్లో ఆడటంపై మోహిందర్ ఆనందం వ్యక్తం చేశాడు. 2015లో కాండీలాండ్ జట్టు నిర్వహించిన పరీక్షకు హాజరైన మోహిందర్ రెండేళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కాండీలాండ్ జట్టు మేనేజర్ బసాల్త్ మిర్జా నుంచి పిలుపు రావడంతో తాను ఎంతో సంతోషానికి గురైనట్లు వెల్లడించాడు. పాకిస్థాన్లో సుమారు 20 వేల సిక్కు జనాభా ఉంది. మోహిందర్ సింగ్ వెస్ట్ లాహోర్లోని నాన్కానా సాహెబ్ ప్రాంతానికి చెందినవాడు. లాహోర్లో డాక్టర్గా పనిచేసే మోహిందర్ సింగ్ తండ్రి తన కుమారుడి క్రీడాసక్తిని ప్రోత్సాహించినట్లు పేర్కొన్నాడు.
మోహిందర్ కన్నా ముందు గులాబ్ సింగ్ అనే సిక్కు యువకుడు తొలిసారి దేశవాళీల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కొన్ని ఏళ్ల కిందట రెండు, మూడు దేశవాళీ మ్యాచ్లు ఆడిన తర్వాత అతను వెలుగులోకి రాకుండా పోయినట్లు స్థానిక క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ జట్టు తరుపున ఏడుగురు ముస్లింలు కాని క్రికెటర్లు ఆడారు. అందులో ఐదుగురు క్రిస్టియన్లు, ఇద్దరు హిందువులు ఉన్నారు.