

హైదరాబాద్: ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బీసీసీఐ దాదాపు రూ.20 నుంచి 30 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఈ ప్రారంభ వేడుకలకు ఎనిమిది ఫ్రాంచైజీల నుంచి ఇప్పటికే ఇద్దరే కెప్టెన్లే అందుబాటులో ఉండనున్నారని సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు చెందిన మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలు మినహాయించి మిగిలిన ఆరు కెప్టెన్లు గైర్హాజరుకానున్నారు.
అత్యంత ధనిక దేశీవాలీ లీగ్గా పేరుగాంచిన ఐపీఎల్కు కెప్టెన్లు లోటు ప్రభావితం చూపుతుందనుకున్నారో.. లేదా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందనో.. బాలీవుడ్ నటులను కూడా ఆహ్వానించింది నిర్వహక సంఘం. రణవీర్సింగ్, పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.
మరి వేడుకకు దూరమైన కెప్టెన్ల వివరాలిలా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరు (విరాట్ కోహ్లీ), రాజస్థాన్ రాయల్స్ (స్టీవెన్ స్మిత్), ఢిల్లీ డేర్ డెవిల్స్ (గౌతం గంభీర్), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఆర్ అశ్విన్), కోల్కత్తా నైట్రైడర్స్ (దినేశ్ కార్తీక్), సన్ రైజర్స్ హైదరబాద్( డేవిడ్ వార్నర్) కొన్ని ఇతరేతర కారణాల వల్ల ఈ వేడుకకు దూరం కానున్నారు.
వీరితో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ 10సీజన్ ప్రారంభోత్సవానికి ఎనిమిది జట్లు కెప్టెన్లు హాజరై వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.