అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్ తో జరిగిన రంజీ మ్యాచ్ లో దిల్లీ టీమ్ ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ దిల్లీ బౌలర్లలో శివం శర్మ 5 వికెట్లతో చెలరేగడంతో దిల్లీకి విజయం వరించింది. కానీ దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ మ్యాచ్ తో రంజీ బరిలోకి దిగి అభిమానుల దృష్టిని ఆకర్షించిన కోహ్లీ.. మళ్లీ బ్యాటింగ్ లో విఫలమైపోయాడు.
అయినప్పటికీ ఈ మ్యాచ్ విజయానికి కారణం కోహ్లీనే అని చెప్పాడు శివం శర్మ. మ్యాచ్ లో తాము బౌలింగ్ చేసేటప్పుడు ఫీల్డ్ ప్లేసింగ్ లో విరాట్ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు. వ్యూహాలు రచించడంలో కోహ్లీ కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చాడని, వాటితోనే తాము విజయం సాధించగలిగామని శివం శర్మ వెల్లడించాడు.

"నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు విరాట్ భయ్యా మాకు కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చాడు. ఫీల్డ్ ప్లేస్ మెంట్ లో కీలకమైన ఇన్ పుట్స్ ఇచ్చాడు. మైదానంలో ఫీల్డింగ్ లో ఏ పొజిషన్ లో నిలబడాలి, ఎక్కడ నిలబడాలి వంటివి చెప్పాడు. అవే మాకు బాగా ఉపయోగపడ్డాయి. అంతర్జాతీయ క్రికెట్ లో అతడికి ఎంతో అనుభవం ఉంది. అవి మాతో పంచుకున్నాడు. నేను అతడిని ఎన్నో సలహాలు అడిగాను. వాటిని ఓపికగా వింటూ, కీలకమైన సలహాలు ఇచ్చాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో కోహ్లీతో కలిసి ఆడటాన్ని మేం ఎంతగానో ఆస్వాదించాం. అతడి భవిష్యత్ గురించి మాకు తెలీదు. ఇకపై ఆడతాడో లేదో అతడి నిర్ణయం. కానీ ఇప్పుడు మేం కలిసి ఆడటం అనేది గొప్ప, మధురమైన జ్ఞాపకం. మంచి ఇంటెన్సిటీతో కోహ్లీ ఆడాడు. నేను మంచి బౌలింగ్ చేశానని ప్రశంసించాడు. బాల్ పై తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. " అని శివం శర్మ తెలిపాడు.
దాదాపు మూడేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన శివం.. భవిష్యత్ గురించి ఆలోచించట్లేదని చెప్పుకొచ్చాడు. "నేను నా భవిష్యత్ గురించి ఆలోచించట్లేదు. గత 3-4 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. సెలక్షన్ గురించి అస్సలు ఆలోచింటలేదు. కేవలం ట్రైనింగ్ పైనే దృష్టి పెట్టాను. మ్యాచులు ఆడుతూ బౌలింగ్ పై ఫోకస్ పెట్టాను. ఇకపై కూడా అదే చేస్తాను" అని శివం శర్మ పేర్కొన్నాడు.