బౌండరీల మోత:
మ్యాచ్లో తొలి రోజు 169 పరుగులతో అజేయంగా క్రీజులో నిలిచిన సర్ఫరాజ్.. రెండో రోజు 8 పరుగులు జోడించి పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ అనంతరం ముంబై త్వరగా వికెట్లు కోల్పోవడంతో 108.3 ఓవర్లలో 427 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ముంబై జట్టు 72/3తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ బౌండరీల మోత మోగించాడు. సహచరుల అండతో వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు.
137 బంతుల్లోనే సెంచరీ:
సర్ఫరాజ్ బౌండరీల మోత మోగిస్తూ కేవలం 137 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఆ తర్వాత కూడా మధ్యప్రదేశ్ బౌలర్లని ఓ ఆటాడుకున్నాడు. దీంతో ముంబై తొలిరోజే మెరుగైన స్కోరు చేసింది. 352/4తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 427 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఒక వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 5 పరుగుల వద్దే ఓపెనర్ రమీజ్ ఖాన్ (4) పెవిలియన్ చేరాడు. మధ్యప్రదేశ్ 4 ఓవర్లలో 11 పరుగులు చేసింది.
ఇప్పటికే 900లకుపైగా పరుగులు:
రంజీ ట్రోఫీలో ఇప్పటికే 900 పరుగుల మార్క్ని అందుకున్న సర్ఫరాజ్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాడు. ఆడిన ఆరు మ్యాచ్ల్లో కలిపి 922 పరుగులు చేసిన సర్ఫరాజ్.. 228.50 సగటుతో దుమ్ములేపుతున్నాడు. సర్ఫరాజ్ ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో చేసిన పరుగులు 71, 31 మాత్రమే. అయితే ఉత్తర్ప్రదేశ్తో ట్రిఫుల్ సెంచరీ చేసిన అనంతరం పరుగుల వరద పారిస్తున్నాడు.
దిగ్గజాల సరసన చోటు:
ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ (391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ముంబై తరఫున ఈ ఘనత అందుకున్న ఏడో బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడెకర్ సర్ఫరాజ్ ఖాన్ కన్నా ముందు ముంబై తరఫున ట్రిపుల్ సెంచరీలు చేసారు.