రాజస్థాన్ రాయల్స్ కీలక ప్లేయర్ రియాన్ పరాగ్ రంజీట్రోఫీలో అదరగొడుతున్నాడు. అస్సాం జట్టులో ఆడుతున్న 22 ఏళ్ల పరాగ్ ఛత్తీస్గఢ్పై 56 బంతుల్లోనే మెరుపు శతకం సాధించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఆదుకున్నాడు. 87 బంతుల్లో 155 పరుగులు చేసి వెనుదిరిగాడు. 11 ఫోర్లు, 12 సిక్సర్లతో చెలరేగాడు.
ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో ఛత్తీస్గఢ్ విజయం దిశగా దూసుకెళ్లోంది. తొలి ఇన్నింగ్స్లో ఛత్తీస్గఢ్ 327 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ అమన్దీప్ (116) శతకంతో కదం తొక్కాడు. శశాంక్ సింగ్ (82), అషుతోష్ సింగ్ (58) రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్, దత్తా, ఆకాశ్, రాహుల్ సింగ్, కునాల్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్లో అస్సాం 159 పరుగులకే ఆలౌటైంది. దెనిష్ దాస్ (52) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఛత్తీస్గఢ్ బౌలర్లలో సౌరభ్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. అయితే 168 పరుగుల వెనుకంజలో ఉన్న అస్సాం ఫాలోయింగ్ ఆన్తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది.
రెండో ఇన్నింగ్స్లోనూ అస్సాం బ్యాటర్లు తడబడ్డారు. కానీ రియాన్ పరాగ్ అద్భుతంగా పోరాడాడు. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో అస్సాం 254 పరుగులు చేసిందంటే రియాన్ చలవే. రియాన్ స్కోరు 155 కాగా, అస్సాం జట్టులో రెండో అత్యధిక స్కోరు 39 మాత్రమే.
అయితే తొలి ఇన్నింగ్స్లో లోటుతో 87 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఛత్తీస్గఢ్ ముందు ఉంచింది. కాగా, లంచ్ విరామానికి ఛత్తీస్గఢ్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. విజయానికి మరో 35 పరుగుల దూరంలో ఉంది.