'నాలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది'.. అంటూ టీమిండియాలో తాను తిరిగి స్థానం దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు అజింక్య రహానె. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న అతడు.. తాజాగా రంజీ ట్రోఫీలో ముంబయి జట్టును సెమీస్ కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడాడు. అలానే ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ప్రస్తుతం జరుగుతోన్న రంజీలో పరుగులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు.
"దేశవాళీ క్రికెట్లో నా బ్యాటింగ్ ప్రదర్శనపై సంతృప్తిగానే ఉన్నాను. అంతర్జాతీయ క్రికెట్ లోకి మళ్లీ వస్తానని ఆశిస్తున్నాను. కానీ అది నా పరిధిలో లేని విషయం. అంతా సెలక్టర్లపైనే ఉంటుంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో నేను బానే ఆడినప్పటికీ.. ఆ తర్వాత తప్పించారు. సెంచరీ కూడా బాదాను. ఏదేమైనా నేషనల్ టీమ్ తరఫున ఆడే అవకాశం కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెటే నన్ను ఆదరించింది.

అందుకే దీని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నాలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది. జూన్ లో ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. కాబట్టి ఏదైనా జరగొచ్చు. ప్రస్తుతానికి రంజీ సెమీస్ పైనే ఫోకస్ పెట్టా" అని రహానె వెల్లడించాడు.
దేశవాళీ క్రికెట్ లో రహానె గత పది మ్యాచుల్లో ఓ సెంచరీ, మూడు 90 ప్లస్, ఒక 80 ప్లస్ స్కోర్ చేశాడు. రంజీలో ముంబయి కెప్టెన్ గా సెంచరీ బాది తన జట్టును సెమీస్ కు తీసుకెళ్లాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోనూ అతడికి నిలకడ ఆటగాడిగా పేరుంది. ఆ మధ్య ఆస్ట్రేలియా పర్యటనలో తాత్కాలిక కెప్టెన్ గా జట్టుకు విజయాన్ని కూడా అందించాడు.