హైదరాబాద్: రంజీ ట్రోఫీలో కర్ణాటక బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ట్రిఫుల్ సెంచరీ నమోదు చేశాడు. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ (304 నాటౌట్: 494 బంతుల్లో 28 ఫోర్లు, 4 సిక్సులు) బాది కెరీర్లోనే తొలిసారి ట్రిఫుల్ సెంచరీని సాధించాడు.
దీంతో గ్రూప్-ఎ మ్యాచ్లో కర్ణాటక మెరుగైన స్థితిలో నిలిచింది. తన తొలి ఇన్నింగ్స్ని 628/5 వద్ద డిక్లేర్ చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకే ఆలౌటైంది. దీంతో 383 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కర్ణాటకకు లభించింది.

ఓవర్నైట్ స్కోరు 461/2తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటకను మయాంక్ నడిపించాడు. అతనికి మద్దతుగా నిలిచిన కరుణ్ నాయర్ (116) కూడా సెంచరీ సాధించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. మయాంక్ ట్రిపుల్ సెంచరీ పూర్తయిన తర్వాత కర్ణాటక తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కర్ణాటక బౌలర్లు అభిమన్యు మిథున్ (2/32) ధాటికి 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటికే రెండు ట్రిఫుల్ సెంచరీలు నమోదయ్యాయి.
ఈ ఘనత అందుకున్న మూడో బ్యాట్స్మెన్గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. మొత్తంగా రంజీ క్రికెట్లో ట్రిఫుల్ సెంచరీ బాదిన 43వ బ్యాట్స్మెన్. కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ తర్వాత మయాంక్ అగర్వాల్ 300 పరుగుల మార్క్ని అందుకున్న క్రికెటర్గా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు:
Maharashtra 245 & 135/4 (Gaikwad 61*, Mithun 32/2) trail Karnataka 628/5 dec.(Agarwal 304*, Nair 116) by 248 runs