ఈ విజయం ప్రత్యేకంగా గుర్తుండిపోవాలి
సీఎం తన ట్విట్టరులో పోస్ట్ చేస్తూ.. 'ఈ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించినందుకు రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉంది. ఈ విజయం మా మనసులను హత్తుకుంది. 41సార్లు ఛాంపియన్ అయిన ముంబైని ఓడించి.. మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకోవడం గర్వించదగ్గది. ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్, కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ, ఇతర టీంమేట్లు అందరిని అభినందిస్తున్నాను. ఇది జట్టు యొక్క సమిష్టి విజయం' అని ANIతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. ఇకపోతే కేవలం శుభాకాంక్షలు మాత్రమే కాదని, మొత్తం జట్టుకు భోపాల్లో ఘన స్వాగతం లభిస్తుందని, ఎందుకంటే వారి ఈ విజయం ప్రత్యేకంగా గుర్తుండిపోవాలని అని సీఎం పేర్కొన్నారు.
టీంను అభినందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఇకపోతే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా మధ్యప్రదేశ్ టీంను అభినందించారు. "ఫైనల్ విజేతలకు అభినందనలు. ఇది నిజంగా చారిత్రాత్మక విజయం.. మీరు చరిత్రను పునఃసృష్టించారు. వెల్ డన్ కోచ్ పండిట్, బాయ్స్ & టీమ్ "అని సింధియా ట్విట్టర్లో రాశారు. ఇకపోతే రంజీ ట్రోఫీ 2021 - 22లో ముంబై వర్సెస్ మధ్యప్రదేశ్ జట్లు ఫైనల్లో తలపడగా.. 42వ సారి రంజీ ట్రోఫీ గెలిచి తమకు ఎదురులేదని చూపించాలనుకున్న ముంబై ఆధిపత్యానికి మధ్యప్రదేశ్ కళ్లెం వేసింది. తొలిసారి సగర్వంగా రంజీ ట్రోఫీ ముద్దాడింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శుభమ్ శర్మ
అయిదో రోజు 113పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ముంబై.. 269పరుగులకు ఆలౌటైంది. ఇక 107పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే మధ్యప్రదేశ్ ముందు ఉంచగలిగింది. ఇక మధ్యప్రదేశ్.. అలవోకగా 108పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. 6వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా రంజీట్రోఫీ చరిత్రలో తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మధ్యప్రదేశ్ ప్లేయర్ శుభమ్ శర్మ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు.
డ్రా అయినా మధ్యప్రదేశ్దే గెలుపు
ఇకపోతే మధ్యప్రదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో యష్ దూబే (133), శుభమ్ శర్మ (116), రజత్ పాటిదార్ (122) సెంచరీలతో రాణించి.. జట్టు 536పరుగుల భారీ స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. దీంతో మధ్యప్రదేశ్కు 162పరుగుల మంచి లీడ్ దక్కింది. తద్వారా మ్యాచ్ డ్రా అయిన మధ్యప్రదేశ్దే విజయం అని ఖాయమైంది. ఇక మ్యాచ్ డ్రా అవుతుందనుకుంటే ముంబై రెండో ఇన్నింగ్స్లో 269పరుగులకే ఆలౌట్ అవ్వడంతో 108పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ చివరి రోజు ఛేదించి విజేతగా నిలిచింది.


Click it and Unblock the Notifications
