|
మధ్యప్రదేశ్ పట్టుదల ముందు.. ముంబై డీలా
ఇక 42వ సారి ట్రోఫీ సాధించాలని ఫైనల్లో ముంబై జట్టు చాలా ఆత్రుతతో ఆడినప్పటికీ.. రంజీ ట్రోఫీ గెలిచి తమ చిరకాల కల నెరవేర్చుకోవాలనుకున్న మధ్యప్రదేశ్ గట్టి పట్టుదల ముందు ముంబై డీలాపడిపోయింది. ఈ మ్యాచ్ 4రోజుల పాటు రసవత్తరంగా సాగింది. నాలుగో రోజు ముగిసేసరికి మధ్యప్రదేశ్ గెలుస్తుందనే ఓ అంచనా వచ్చేసింది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాగా.. ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ (134), జైశ్వాల్ (78) పరుగులతో చెలరేగడంతో 374పరుగులకు ఆలౌటైంది.
|
ముగ్గురు సెంచరీలతో చెలరేగడంతో..
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన మధ్యప్రదేశ్ అత్యంత అద్భుతంగా ఆడింది. ఆ జట్టులో యష్ దూబే (133), శుభమ్ శర్మ (116), రజత్ పాటిదార్ (122) సెంచరీలతో రాణించడంతో 536పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఇక సారాన్స్ జైన్ (57) సైతం ఉపయుక్తమయిన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మధ్యప్రదేశ్కు 162పరుగుల మంచి లీడ్ దక్కింది. ఇక రంజీ ట్రోఫీ నిబంధనల ప్రకారం.. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా.. తొలి ఇన్నింగ్స్లో లీడ్ సాధించన జట్టే విజేతగా నిలుస్తుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి మధ్యప్రదేశ్ విజయం దాదాపు ఖాయమైంది. కానీ అవతల ఉన్నది ముంబై లాంటి భీకర జట్టు కావడంతో ఇంకా మ్యాచ్ ఉత్కంఠగానే సాగింది.
|
ముంబై దూకుడుగా ఆడినప్పటికీ..
ఇక రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ముంబై బ్యాటర్లు దూకుడుగా ఆడడం మొదలెట్టారు. కెప్టెన్ పృథ్వీ షా (44), సువేద్ పార్కర్ (51), సర్ఫరాజ్ ఖాన్ (45) ధాటిగా ఆడారు. దీంతో స్కోరు తిరిగి ముంబై ఆధిక్యం సంసాదించింది. అయితే చివరి రోజు ముంబై 269పరుగులకే ఆలౌట్ అవ్వడంతో ఆధిక్యం 107పరుగులకే పరిమితమైంది. ఇక మధ్య ప్రదేశ్ విజయం సాధించాలంటే 108పరుగులు కావాల్సిన తరుణంలో బ్యాటింగ్కు దిగిన మధ్యప్రదేశ్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగలింది. 2 పరుగుల వద్ద యష్ దుబే ఔటవ్వడంతో ఉత్కంఠ నెలకొంది.
|
విజయ లాంఛనాన్ని ముగించిన రజత్ పాటిదార్
అయితే హిమాన్షు మంత్రి (37), శుభమ్ శర్మ (30) చాలా జాగ్రత్తగా ఆడారు. 54పరుగుల వద్ద రెండో వికెట్ కూడా పడడంతో ముంబైకి ఆశలు మొదలయ్యాయి. 66పరుగుల వద్ద పార్థ్ సహానీ (5) సైతం ఔటవ్వడంతో మ్యాచ్ కాసేపు ఉత్కంఠగా సాగింది. అయితే ముంబైకి రజత్ పాటిదార్ (30) అవకాశమివ్వలేదు. శుభమ్ శర్మ చివర్లో ఔటయినప్పటికీ.. కడవరకు క్రీజులో ఉండి పాటిదార్ విజయ లాంఛనాన్ని ముగించాడు. కెప్టెన్ అదిత్య శ్రీవత్సవ సహా.. మధ్యప్రదేశ్ ప్లేయర్లందరూ స్టేడియంలోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.