వాంఖడే స్టేడియం వేదికగా విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్ చెలరేగాడు. 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో అడుగుపెట్టిన శార్దూల్ ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. 69 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. శార్దూల్ పోరాటంతో తొలి ఇన్నింగ్స్లో ముంబై 64.3 ఓవర్లలో 224 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ముంబైకు శుభారంభమే లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా (46; 63 బంతుల్లో), భూపేన్ (37; 64 బంతుల్లో) తొలి వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే భూపేన్ను యశ్ ఠాకూర్ ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. విదర్భ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు. ముషీర్ ఖాన్ (6; 12 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (7; 15 బంతుల్లో), అజింక్య రహానె (7; 35 బంతుల్లో), హార్దిక్ టమోరె (5; 41 బంతుల్లో) నిరాశపరిచారు.

టీమిండియాలో చోటు కోల్పోయి, సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కని శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. అలాగే రహానె తన ఫేలవఫామ్ను కొనసాగిస్తున్నాడు. అయితే శార్దూల్ రాకతో ముంబై ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. 43 పరుగుల వద్ద సిక్సర్ బాదిన శార్దూల్ తర్వాత బంతికి సింగిల్ తీసి హాఫ్సెంచరీ అందుకున్నాడు.
శార్దూల్ ధాటిగా ఆడుతున్నప్పటికీ మరో ఎండ్లో విదర్భ బౌలర్లు క్రమంగా వికెట్లు తీశారు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో శార్దూల్ ఔటవ్వడంతో ముంబై ఇన్నింగ్స్కు తెరపడింది. విదర్భ బౌలర్లలో హర్ష దూబె, యశ్ ఠాకూర్ చెరో మూడు వికెట్లు, ఉమేశ్ యాదవ్ రెండు, ఆదిత్య ఠాక్రే ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ధ్రువ్ షోరెను శార్దూల్ డకౌట్ చేశాడు. కాసేపటికే అమన్ (8; 15 బంతుల్లో)ను కులకర్ణి పెవిలియన్కు చేర్చాడు.