పిచ్పైకి దూసుకొచ్చిన కారు
కారు పిచ్పైకి దూసుకొచ్చిన సమయంలో అంతర్జాతీయ ఆటగాళ్లు గౌతం గంభీర్, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, తదితరులు గ్రౌండ్లోనే ఉన్నా రు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఫోర్స్ పోలీసులు గేట్లను మూసివేసి కారును నడిపిన గిరీశ్ శర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అనంతరం విచారణ నిమిత్తం ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
|
రిఫరీ ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమైన మ్యాచ్
రిఫరీ ఆదేశాల మేరకు మ్యాచ్ను తిరిగి కొనసాగించారు. నిజానికి ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగాల్సి ఉంది. గత బుధవారం టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 జరిగిన నేపథ్యంలో రంజీ మ్యాచ్ కోసం పాలెం ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ ఎంచుకున్నారు.
పూర్తిగా భద్రత లేకపోవడంతోనే
అయితే దీని చుట్టూ పూర్తిగా భద్రత లేకపోవడంతో కారుతో నేరుగా లోపలికి వచ్చినట్లు రంజీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన బీసీసీఐ దృష్టికి రావడంతో మ్యాచ్ అధికారుల్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే గిరీశ్ శర్మ తన స్నేహితుడికి జరిగిన అవమానానికి ప్రతీకారంగానే ఇలా చేశాడని స్టేడియ సిబ్బంది ఒకరు తెలిపారు.
|
మ్యాచ్ చూద్దామని వచ్చాను: గిరీశ్ శర్మ
ఇక, ఈ ఘటనపై గిరీశ్ శర్మ మాట్లాడుతూ 'నా సోదరిని విమానాశ్రయంలో దించి తిరిగొస్తుండగా.. పాలెం మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నట్లు తెలిసింది. కాసేపు మ్యాచ్ చూద్దామని వచ్చాను. అయితే గేటు వద్ద భద్రత సిబ్బంది ఎవరూ లేకపోవడంతో లోపలికెళ్లి ఆటగాళ్లను కలుద్దామనుకున్నా. కానీ కారును ఎక్కడ ఆపాలనే విషయంలో తెలియక మైదానంలోనే ఆపే ప్రయత్నం చేశా' అని అన్నాడు.