రంజీ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ రంజీ ఆడనున్నాడు. జనవరి 30న దిల్లీ తరఫున బరిలోకి దిగబోతున్న అతడు రైల్వేస్ జట్టుతో తలపడనున్నాడు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం దిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మెదలుపెట్టాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచిన విరాట్.. ఫామ్ అందిపుచ్చుకోవడం కోసం ఈ రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గతంలో రంజీ మ్యాచులలో ఎలాంటి ప్రదర్శన చేశాడు, ఎన్ని పరుగులు చేశాడు, ఎలాంటి రికార్డులు సాధించాడు వంటివి తెలుసుకుందాం.

కోహ్లీ 2006 నవంబర్ లో దిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లో తమిళనాడుపై ఆడాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ నెం.5 స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 25 బంతుల్లో 10 పరుగులు చేశాడు. తన తొలి రంజీ సెంచరీని 2007-08లో రాజస్థాన్ పై బాదాడు కోహ్లీ. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 19 పరుగులకు ఔటైన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్ లో 192 బంతుల్లో 106 రన్స్ చేశాడు. మొత్తంగా ఆరేళ్ల పాటు రంజీ బరిలోకి దిగిన విరాట్.. చివరిగా 2012 నవంబర్ లో ఉత్తర ప్రదేశ్ పై మ్యాచ్ ఆడాడు. మొత్తంగా 23 రంజీ మ్యాచులు ఆడి 1547 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. 2011లో జూన్ లో టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేశాక.. ఒక్క సారి మాత్రం డొమాస్టిక్ ఫస్ట్ క్లాక్ మ్యాచ్ ఆడాడు.
2006-07 - 6 మ్యాచులు, 257 పరుగులు, ఒక హాఫ్ సెంచరీ, అత్యధిక స్కోర్ 90
2007-08 - 5 మ్యాచులు, 373 పరుగులు, రెండు శతకాలు, అత్యధిక స్కోర్ 169
2008-09 - 4 మ్యాచులు, 174 పరుగులు, 2 అర్ధ శతకాలు, అత్యధిక స్కోర్ 83
2009-10 - 3 మ్యాచులు, 374 పరుగులు, 1 సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు, అత్యధిక స్కోర్ 145
2010-11 - 4 మ్యాచులు, 339 పరుగులు, 2 శతకాలు, అత్యధిక స్కోర్ 173
2012-13 - 1 మ్యాచ్, 57 పరుగులు, అత్యధిక స్కోర్ 43