టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దిల్లీ టీమ్ తో కలిసి అరుణ్ జెట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. అయితే ఈ మ్యాచ్ కు ఓ అనుకోని అతిథి వచ్చాడు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే అక్కడే కూర్చొని విరాట్ సాధన చూస్తూ ఉన్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే కబీర్ అనే స్కూల్ విద్యార్థి.
కబీర్ కేవలం ఓ అభిమాని మాత్రమే కాదు. విరాట్ కోహ్లీ ఏజ్ గ్రూప్ టీమ్ మేట్ కొడుకు. కబీర్ తండ్రి విరాట్ తో ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడాడు. అయితే తాజాగా విరాట్ అరుణ్ జెట్లీ స్టేడియానికి వస్తున్నాడని తెలిసి కబీర్ కూడా తన తండ్రితో కలిసి ఆ మైదానానికి వెళ్లాడు. కోహ్లీ నెట్స్ లో ఎంతలా కష్టపడుతూ సాధన చేస్తూ గమనిస్తూ కూర్చున్నాడు. అనంతరం విరాట్ తో కలిసి కాసేపు ముచ్చటించాడు. విరాట్ దగ్గర నుంచి విలువైన సూచనలు తీసుకున్నాడు. స్టార్ క్రికెటర్ గా ఎదగాలంటే ఏం చేయాలో అడిగి మరి తెలుసుకున్నాడు. ఇంకా ఓ పేపర్ పై గుర్తుగా కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. చివరిగా తాను వేసిన కోహ్లీ పెన్సిల్ స్కెచ్ ను బహుమతిగా ఇచ్చాడు.

కోహ్లీని కలవడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు కబీర్. "స్టార్ క్రికెటర్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాను. అంకిత భావంతో ఉంటూ బాగా కష్టపడాలి, ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలి అని చెప్పారు. ఆయన్ను కలవడం ఆనందంగా ఉంది. ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు." అని ఆనందం వ్యక్తం చేశాడు కబీర్. ప్రస్తుతం కబీర్ మాట్లాడిన మాటలు, కోహ్లీని చూస్తూ కూర్చున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విరాట్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.