రంజీ ట్రోఫీ 2024-25లో మరో సంచలనం నమోదు అయింది. తాజాగా నాసిక్ వేదికగా జరిగిన మ్యాచ్లో CSK ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తోన్న మహారాష్ట్ర జట్టు ఏకంగా 439 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 617 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి బరోడా జట్టు 177 పరుగులకే చాప చుట్టేసింది.
మ్యాచ్ సాగిందిలా..
నాసిక్ వేదికగా మహారాష్ట్ర - బరోడా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. బరోడా 145 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్లో కుప్పకూలింది.

అనంతరం మహారాష్ట్ర 464/7 దగ్గర తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మహారాష్ట్ర బ్యాటర్లలో సౌరభ్ నవలే(126) శతకంతో మెరవగా..రామక్రిష్ణ(99) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(89) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మహారాష్ట్ర.. తమ తొలి ఇన్నింగ్స్లో లభించిన 152 పరుగుల ఆధిక్యాన్ని జోడించి బరోడా ముందు 617 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
బౌలర్ల దెబ్బకు బ్యాటర్లు విలవిల
కానీ ఈ భారీ లక్ష్యాన్ని ఛేధించలేక బరోడా కుప్పకూలింది. మహారాష్ట్ర బౌలర్ల దెబ్బకు బరోడా బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖేష్ చౌదరి 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. రజనీష్ గుర్బానీ మూడు వికెట్లు, రామక్రిష్ణ రెండు వికెట్లు దక్కించుకున్నారు. బరోడా బ్యాటర్లలో అతి సేథ్(51) హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. జ్యోత్స్నిల్ సింగ్(40) నామమాత్రపు ఇన్నింగ్ ఆడాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యతో పాటు మిగితా బ్యాటర్లు దారుణ ప్రదర్శన చేశారు.