టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి క్రికెట్ అభిమానుల మనసు దోచాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ సారథి రోహిత్ ఏం చేశాడంటే?
రంజీ ట్రోఫీలో ఆడి మునుపటి జోరు అందుకోవాలనుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే జమ్మూ కశ్మీర్ తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. అందుకు కారణం పేసర్ ఉమర్ నజీర్ మిర్. ఓ షార్ట్ పిచ్ బంతితో రోహిత్ను ఊరించి మరీ వికెట్ సాధించాడాతడు. రోహిత్ ను మాత్రమే కాదు, ఆ జట్టు టాప్ బ్యాటర్లు అజింక్య రహానె (12), శివమ్ దూబె (0), హార్దిక్ టామోర్ (7)లను హడలెత్తించాడు. దీంతో అప్పటి వరకు పెద్దగా ఎవరికీ పరిచయంలేని నజీర్.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

అయితే ఈ క్రమంలోనే తాజాగా తన జీవితంలో మర్చిపోలేని మధుర అనుభూతి అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశాడు నజీర్. తన దేవుడు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఇందులో రోహిత్.. నజీర్ కు అతడి బ్యాట్ పై ఆటోగ్రాఫ్ ఇస్తూ కనిపించాడు. ఈ పిక్ నే నజీర్ పోస్ట్ చేసి 'మూమెంట్' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. రోహిత్ ది మంచి మనసంటూ క్యాప్షన్ పెడుతున్నారు.
అంతకుముందు నజీర్ కూడా కేవలం ఆటతోనే కాకుండా తన చర్యలతో క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. బౌలర్లు ఎవరైనా కీలకమైన వికెట్ తీస్తే మైదానంలో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ నజీర్ అలా చేయలేదు. తాను రోహిత్ కు వీరాభిమానిని, అందుకే వికెట్ తీసిన తర్వాత సంబరాలు చేసుకోలేదని చెప్పి అభిమానుల మనసు దోచుకున్నాడు.
ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో జమ్మూకశ్మీర్ విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్లో 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్.. ఓ దశలో 159 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత పుంజుకుని గెలుపొందింది. ముంబయి బౌలర్ షామ్స్ ములానీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ 28 పరుగులు చేశాడు.