రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు చేయలేక ఇబ్బంది పడుతోన్న భారత స్టార్ క్రికెటర్లు ఫామ్ ను అందిపుచ్చుకోవడానికి రంజీ బరిలో దిగారు. కోహ్లీ మినహా.. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్, రవీంద్ర జడేజా ఈ రంజీ ఆడారు. కానీ వీళ్లంతా తమ తొలి మ్యాచ్ లోనే విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
యశస్వి 4, రోహిత్ 3
ముంబయి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ.. జమ్ము కశ్మీర్తో జరుగుతోన్న మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లుగా దిగిన జైస్వాల్ (4) పరుగులు చేయగా.. 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్ (3) పరుగులే చేశాడు. షార్ట్ పిచ్ బంతిని పుల్ చేయబోయిన హిట్ మ్యాన్ చెత్త షాట్ ఆడి మిడాఫ్లో దొరికిపోయాడు. కెప్టెన్ అజింక్య రహానె (12), శ్రేయస్ అయ్యర్ (11) కూడా నిరాశపరిచారు.

గిల్ 4, పంత్ 1
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో వైస్ కెప్టెన్గా ఎంపికైన గిల్.. రంజీలో పంజాబ్ కెప్టెన్ గా బరిలోకి దిగాడు. కానీ 8 బంతుల్లో నాలుగు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. సౌరాష్ట్రతో జరుగుతోన్న మ్యాచ్లో దిల్లీ జట్టు ప్లేయర్ భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పది బంతులు ఆడి (1) పరుగుకే వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అలా యశస్వి 4, గిల్ 4, రోహిత్ 3, పంత్ 1 క్రికెట్ అభిమానులను నిరాశపరిచారు.