ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో అంతటా దేశవాళీ క్రికెట్ గురించే చర్చ సాగుతోంది. ఎందుకంటే ప్రతీ క్రికెటర్ దేశవాళీలో కచ్చితంగా ఆడాల్సిందేనని బీసీసీఐ గట్టిగా చెప్పడంతో ప్లేయర్స్ రంజీ మ్యాచ్ ల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఒక్కోక్కరిగా టీమిండియా స్టార్స్ అంతా కూడా త్వరలో(జనవరి 23) ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నారు. నెక్ట్స్ ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆటగాళ్లు ఫామ్ అందుకోవాలనేది బీసీసీఐ సెలక్టర్ల యోచన.
అయితే మెడ నొప్పి కారణంగా రంజీల్లో కోహ్లీ దాదాపుగా ఆడడనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. రోహిత్ పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, టీమిండియాలో భవిష్యత్ స్టార్ క్రికెటర్లుగా ఎదుగుతోన్న రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ రంజీ గ్రూప్ స్టేజ్ తొలి రౌండ్ లో ఆడతారని తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో పంత్, గిల్, యశస్వి దేశవాళీ క్రికెట్ గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం.

యశస్వి జైస్వాల్.. ఓ సంచలనం
యశస్వి జైస్వాల్ ఓ సంచలనం. ఓపెనర్గా ప్రత్యర్థులపై ఆధిపత్య ప్రదర్శన చేశాడు. రీసెంట్ గా ఆస్ట్రేలియా పర్యటనలోనూ టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు. రంజీ ట్రోఫీలోనూ అదిరే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ముంబయి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు యశస్వి. 2022 సీజన్లో కేవలం మూడు మ్యాచులే ఆడి, 83 సగటుతో 498 పరుగులు సాధించాడు. యశస్వి అత్యధిక వ్యక్తిగత స్కోరు 181 కావడం విశేషం. ముంబయి ఫైనల్కు అర్హత సాధించడంలోనూ కీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత భారత జట్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. టెస్టుల్లోనూ మంచి ఓపెనర్గా రాణిస్తున్నాడు.
ఓపెనర్ గా అద్భుతం
ప్రస్తుతం గిల్ అత్యంత పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోనూ అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాడు. అందుకే ఫామ్ కోసం రంజీ బరిలోకి దిగుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీలో పూర్తి సీజన్ను ఆడాడు. 9 ఇన్నింగ్స్ల్లో దాదాపు 104 సగటుతో 728 పరుగులు సాధించాడు. తమిళనాడుపై ఏకంగా 268 పరుగులు చేశాడు. ఓపెనర్గా అద్భుతంగా రాణించాడు.
2018లో అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు గిల్. ఐపీఎల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. టీమిండియాకు ఎంపికైన ప్రారంభరోజుల్లో అద్భుత ప్రదర్శనలు చేశాడు. కానీ ఇప్పుడు రాణించలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడతడు పేలవ ఫామ్ నుంచి బయటకు రావాలంటే రంజీ ఆటడం ముఖ్యం.
పిన్న వయసులోనే ట్రిపుల్ సెంచరీ
పంత్ చివరిగా 2016-17లో రంజీ ఆడాడు. దిల్లీ జట్టుకు ప్రాతనిథ్యం వహించిన పంత్ 81 సగటుతో 972 పరుగులు చేశాడు. ఇందులో మహారాష్ట్ర జట్టుపై ట్రిపుల్ సెంచరీ (308) కూడా ఉండటం విశేషం. దీంతో రంజీల్లో అతి చిన్న వయసులోనే త్రిశతకం చేసిన బ్యాటర్గా పంత్ రికార్డుకెక్కాడు. ఆ తర్వాత సంవత్సరమే టీమిండియా టెస్టు జట్టులోకి అరంగేట్రం చేశాడు.
ఇకపోతే రీసెంట్ గానే దులీప్ ట్రోఫీలో పాల్గొన్నాడు పంత్. ఇప్పుడు రంజీల్లోనూ ఆడి ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి ఫామ్ అందిపుచ్చుకోవాలనేది పంత్ తో పాటు అభిమానుల కోరిక. ఈ సారి కూడా పంత్ దిల్లీ జట్టు తరఫునే బరిలోకి దిగుతున్నాడు.