రంజీ ట్రోఫీ సెకెండ్ లెగ్ మ్యాచ్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫామ్ అందిపుచ్చుకోవడం కోసం రంజీల్లో కచ్చితంగా ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్లంతా బరిలోకి దిగారు. అయితే తొలి రోజే అంతా తుస్సుమనిపించారు. దీంతో అభిమానులంతా నిరాశ చెందారు. ఈ క్రమంలోనే ఒకే ఒక్కడు మాత్రం అద్భుత ప్రదర్శన చేసి క్రికెట్ అభిమానుల్లో కాస్త జోష్ నింపాడు.
ముంబయి తరపు బరిలోకి దిగిన రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ ప్లేయర్ శుభ్మన్ గిల్.. దిల్లీ ఆటగాడు రిషభ్ పంత్.. అంతా విఫలమైనా.... సౌరాష్ట్ర తరపు బరిలోకి దిగిన రవీంద్ర జడేజా మాత్రం మంచిగా రాణించాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

పంత్ సైలెంట్.. ఫుల్ జోష్ లో జడేజా
దిల్లీ, సౌరాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ కు దిగిన దిల్లీ 188 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) పర్వాలేదనిపించారు. అయితే దిల్లీ తరఫున బరిలోకి దిగిన పంత్ దారుణమైన ప్రదర్శన చేశాడు. 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక దిల్లీ బ్యాటింగ్ లైనప్ను స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఓ ఆటాడుకున్నాడు. 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత. జడేజాకు ధర్మేంద్రసిన్హ్ తోడై మరో 3 వికెట్లు తీశాడు. 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి ఈ వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా పంత్ జట్టును జడేజా షేక్ ఆడించాడు.