దేశవాళీ క్రికెట్లో ప్రతిఒక్కరూ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్, శుభమన్ గిల్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఆడేందుకు రెడీ అయిపోయాడు. కానీ ఈ విషయంలో అతడి ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది.
సాధారణంగా కోహ్లీ, రోహిత్ ఆడే మ్యాచులకు అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అందుకే రీసెంట్ గా రోహిత్ ఆడిన రంజీ మ్యాచ్కు బీసీసీఐ లైవ్ కవరేజీ ఇచ్చింది. కానీ అది ఓటీటీలోనే ప్రసారమైంది. అయితే, ఇప్పుడు కోహ్లీ ఆడే రంజీ మ్యాచ్ కు లైవ్ కవరేజ్ ఇవ్వట్లేదని తెలిసింది. ఈ విషయంపై దిల్లీ క్రికెట్ సంఘం కూడా స్పందించింది.

'' ఇప్పటికైతే మాకు ఎలాంటి సమాచారం రాలేదు. మరి బీసీసీఐ చివరి నిమిషంలో ఏమైనా లైవ్ కవరేజీకి విషయంలో నిర్ణయం తీసుకుంటుందేమో తెలీదు. సాధారణంగా పెద్ద మ్యాచ్లు అయితే లైవ్ కవరేజీ లేదా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేలా చేస్తారు. మరి మా మ్యాచ్ కు ఏం చేస్తారో చూడాలి '' అని దిల్లీ క్రికెట్ సంఘం అధికారులు తెలిపారు.
ఆ మ్యాచ్కు ఉండొచ్చు
దిల్లీ - రైల్వేస్ మ్యాచ్ కు లైవ్ కవరేజీ లేనప్పటికీ.. కర్ణాటక - హరియాణా మ్యాచ్ కు రోస్టర్ పద్ధతిలో లైవ్ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
13ఏళ్ల తర్వాత
దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. చివరిసారిగా 2012లో ఉత్తర్ప్రదేశ్పై రంజీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు జనవరి 30 నుంచి రైల్వేస్తో జరగబోయే మ్యాచ్లో దిల్లీ తరఫున బరిలోకి దిగుతాడు. ఆయుష్ బదోని నాయకత్వంలో దిల్లీ జట్టు ఆడనుంది.