ప్రస్తుతం రంజీ ట్రోఫీ సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రోఫీలో ఇప్పుడు ఓ పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే ఉమర్ నజీర్ మిర్. ఎందుకంటే ఫామ్ అందిపుచ్చుకోవడానికి దాదాపు 10 ఏళ్ల తర్వాత రంజీలోకి వచ్చిన దిగ్గజ ప్లేయర్ రోహిత్ నే నజీర్ హడలెత్తించాడు. క్రీజులోకి వచ్చిన హిట్ మ్యాన్ ను 3 పరుగులకే పెవిలినయ్ పంపాడు నజీర్. పైగా రోహిత్ ప్రాతినిథ్యం వహించిన ముంబయి జట్టు కెప్టెన్ రహానెను కూడా ఔట్ చేశాడు. యువ సంచలనం శివమ్ దూబెను కూడా తొలి బంతికే ఔట్ చేశాడు. అందుకే ఇప్పుడీ 31 ఏళ్ల పేసర్ పేరు మార్మోగిపోతోంది.
ఇంతకీ నజీమ్ ఎవరంటే
జమ్ముకశ్మీర్కు చెందిన నజీర్ ఎత్తు 6.4 అడుగులు. చక్కటి పేస్తో పాటు బౌన్స్ రాబట్టడం అతడి స్పెషాలిటీ. 2013లో ఫస్ట్ క్లాస్ కెరీర్ను ప్రారంభించాడు. ఇప్పటి వరకు 57 మ్యాచ్లు ఆడాడు. 138 వికెట్లు తీశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 54 వికెట్లు తీసిన అతడు టీ20ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. 2018-19 దేవధర్ ట్రోఫీ భారత్ C స్క్వాడ్లో చోటు సంపాదించాడు కానీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

వరుస వికెట్లు
ప్రస్తుత రంజీ ట్రోఫీలో భాగంగా జమ్ముకశ్మీర్ - ముంబయి మధ్య జరిగిన మ్యాచ్ లో ఉమర్ నజీర్ తన ప్రదర్శనతో వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. షార్ట్ పిచ్ బంతితో రోహిత్ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత హార్దిక్ తమోర్ (7)ను ఔట్ చేశాడు. కెప్టెన్ అజింక్య రహానె (12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. శివమ్ దూబె డకౌట్ గా వెనుదిరగడానికి కారణమయ్యాడు.