ప్రస్తుతం జరుగుతోన్న రంజీ ట్రోఫీలో కళ్లు చెదిరే రికార్డు నమోదైంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓ బౌలర్ ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా 9 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 65 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఓ అరుదైన రికార్డ్ ను బ్రేక్ చేశాడు.
అహ్మదాబాద్లోని గుజరాత్ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్లో తాజాగా గుజరాత్ - ఉత్తరాఖండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనే గుజరాత్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ 9 వికెట్లు తీశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సిద్ధార్థ్ కేవలం 36 పరుగులే ఇచ్చి 9 వికెట్లు తీయడం విశేషం. గతంలో 1960-61 సీజన్లో సౌరాష్ట్రపై జసుభాయ్ మోతీభాయ్ పటేల్ 21 పరుగులకు 8 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడా 65 ఏళ్ల అరుదైన రికార్డ్ ను సిద్ధార్థ్ బ్రేక్ చేశాడు.

ఐదో ఓవర్ లో మూడో బంతికి ప్రియాన్షు ఖాండూరీని ఔట్ చేసి తొలి వికెట్ సాధించాడు సిద్ధార్థ్. అక్కడి నుంచి వికెట్ల వేట మొదలు పెట్టిన సిద్ధార్థ్.. నాలుగు బంతుల వ్యవధిలోనే సామార్థ్, యువ్రా చౌదరిని వెంటవెంటనే వరుసగా పెవిలియన్ పంపాడు. అనంతరం కునాల్ చండేలా ఎల్బీడబ్ల్యూ, మయాంక్ మిశ్రా, ఓపెనర్ అవనీష్ సుధా, ఆదిత్య తారే, అభయ్ నేగి, డి ధపోలను ఔట్ చేశాడు. మొత్తంగా రంజీ ట్రోఫీ చరిత్రలో సిద్ధార్థ్ బౌలింగ్ ఫిగర్ మూడో అత్యుత్తమ ప్రదర్శ. గత సీజన్ లో హరియాణాకు చెందిన అన్షుల్ కామ్బోజ్ రంజీ చరిత్రలోనే బెస్ట్ స్పెల్ వేశాడు. కేరళ జట్టుపై ఏకంగా 10 వికెట్లు తీశాడు.
సిద్ధార్థ్ దేశాయ్ 2017-18 రంజీ సీజన్ తో గజరాత్ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. 2018 అక్టోబర్ లో ఏసీసీ అండర్ 19 ఆసియా కప్ లో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఐదు మ్యాచు్లో 18 వికెట్లు పటగొట్టాడు. కానీ అతడి ప్రదర్శనను టీమిండియా గుర్తించలేదు. అనంతరం 2018-19 రంజీ సీజన్ లో ఆరు మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. దీంతో మళ్లీ అతడికి 2019 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ లో చోటు దక్కింది.