సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటైతే ఏ బ్యాటర్కైనా ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా జరుగుతోన్న రంజీ ట్రోఫీలో పలువురు క్రికెటర్లకు ఈ దురదృష్టమే వెంటాడింది. పుజరా, బదోని, రహానె అంతా పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నారు.
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా రాజ్కోట్ వేదికగా అసోం - సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర ప్లేయర్ పుజారా ఒక్క పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. 167 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేసిన అతడు.. సరిగ్గా 99 పరుగుల వద్ద ముక్తర్ హూస్సేన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో అతడికి 67వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మిస్ అయింది.

రహానే, బదోనీ కూడా..
మరోవైపు మేఘాలయతో జరుగుతోన్న మ్యాచ్ లోనూ ఇదే జరిగింది. ముంబయి కెప్టెన్ అజింక్య రహానే కూడా తృటిలో సెంచరీని కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్లో నఫీస్ సిద్ధిక్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి 96 పరుగుల దగ్గర వికెట్ను కోల్పోయాడు. దిల్లీ కెప్టెన్ బదోనీ కూడా రైల్వేస్ తో జరుగుతోన్న మ్యాచ్ లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇదే మ్యాచ్ లో కోహ్లీ దారుణంగా 6 పరుగులతో నిరాశపరిచాడు.
పుజారా విషయానికొస్తే.. కెరీర్ లో ఇప్పటివరకు 276 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడగా.. 51.89 సగటుతో 21174 పరుగులు చేశాడు. ఇందులో 66 శతకాలు, 80 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో 103 మ్యాచ్లు ఆడి 7195 పరుగులు చేశాడు. అందులో 19 శతకాలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. చివరగా 2023లో టీమిండియా తరపున ఆస్ట్రేలియాపై జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడాడు.