ప్రస్తుతం భారత క్రికెట్ లో దేశవాళీ క్రికెట్ గురించి తీవ్రంగా చర్చజరుగుతోంది. స్టార్ ప్లేయర్లంతా తమ స్థాయి గురించి ఆలోచించకుండా డొమాస్టిక్ క్రికెట్ ఆడాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫామ్లో లేక సతమతమవుతోన్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబయి జట్టు తరఫున బరిలోకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. గిల్, పంత్ కూడా తమ జట్లకు అందుబాటులో ఉంటారని పంజాబ్, దిల్లీ జట్లు తెలిపాయి. అయితే దిల్లీ ప్రాబబుల్స్ లో పంత్ తో పాటు కోహ్లీకి కూడా చోటు ఇచ్చింది. కానీ విరాట్ ఆడతాడా? లేదా? అనేది తెలియడం లేదు. దీంతో ఇప్పుడు కోహ్లీ రంజీ బరిలోకి దిగుతాడా లేడా అనేది క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే విరాట్ కు కీలక సూచనలు చేశారు డీడీసీఏ ప్రధాన కార్యదర్శి అశోక్ శర్మ. ముంబయి ప్లేయర్లను స్ఫూర్తిగా తీసుకుని దేశవాళీ క్రికెట్లో ఆడాలని వెల్లడించారు. "జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్ కోసం ప్రాబబుల్స్ను రెడీ చేశాం. విరాట్ కోహ్లీ కూడా రంజీ మ్యాచ్ ఆడాలి. అతడి పేరును ప్రాబబుల్స్ లో ఉంచాం. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు బరిలోకి దిగాలి. ముంబయి ప్లేయర్లు ఆడుతున్నారు. దిల్లీలో ఇలా జరగట్లేదు. బీసీసీఐ కూడా దేశవాళీ ఆడాలని చెబుతోంది. కాబట్టి విరాట్ కనీసం ఒక్కటైనా ఆడాలి" అని వెల్లడించారు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఖాళీ దొరికినప్పుడు దేశవాళీ బరిలో దిగాలనేది బీసీసీఐ పెట్టిన నిబంధన. ఆ మధ్య శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి దేశావాళీ క్రికెట్ ఆడనందుకు, వారిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది బోర్డు. దీంతో కొంతమంది ప్లేయర్లు దేశవాళీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కోహ్లి, రోహిత్, బుమ్రా లాంటి స్టార్లు మాత్రం దేశవాళీకి దూరంగానే ఉంటున్నారు. చూడాలి మరి ఇకనైనా ఆడతారో లేదో.