రంజీ ట్రోఫీ 2024-25 సీజన్కు ఢిల్లీ సంభావ్య జట్టులో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఉన్నాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) వెల్లడించిన రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్లో కోహ్లితో పాటు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఉన్నాడు. 2018 తర్వాత ఢిల్లీ సంభావ్య జట్టులో కోహ్లి పేరు ఉండటం ఇదే తొలిసారి.
విరాట్ కోహ్లి, పంత్తో పాటు నవదీప్ సైని కూడా జాబితాలో ఉన్నాడు. అయితే గత సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన ఇషాంత్ శర్మ పేరు జాబితాలో లేదు. డీడీసీఏ 84 మంది ఆటగాళ్లతో జాబితాను విడుదుల చేసింది. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో ఛండీఘర్తో తలపడనుంది. అయితే అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో ప్రాబబుల్స్లో కోహ్లి, పంత్ పేరు ఉన్నప్పటికీ..వాళ్లు ఛండీఘర్ మ్యాచ్కు అందుబాటులో ఉండటంపై స్పష్టత లేదు. ''జాబితాలో ఉన్న ఆటగాళ్లకు సెప్టెంబర్ 26న ఫిట్నెస్ టెస్టు ఉంటుంది. అంతర్జాతీయ డ్యూటీలో ఉన్న ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్టు నుంచి మినహాయింపు ఉంటుంది'' అని డీడీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, కోహ్లి చివరిగా 2012-13 సీజన్లో రంజీ ట్రోఫీ ఆడాడు. అప్పుడు న్యూజిలాండ్తో సిరీస్ విజయవంతంగా ముగించిన అనంతరం కోహ్లి ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు. మరోవైపు ఢిల్లీ తరఫున 2015లో అరంగేట్రం చేసిన పంత్ 17 రంజీ మ్యాచ్లు ఆడాడు. 2016-17 సీజన్లో పంత్ హాట్ టాపిక్గా నిలిచాడు. జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో 48 బంతుల్లో సెంచరీ సాధించాడు.