
రంజీ ట్రోఫీ వాయిదా
ఇటీవల దేశవాళీ క్రికెటర్లు భారీగా కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 13 నుంచి మార్చి 20 వరకు జరగాల్సిన ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని బీసీసీఐ వాయిదా వేసింది. రంజీ ట్రోఫితోపాటు కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్ మహిళల టీ20 లీగ్లను కూడా వాయిదా వేసింది. పాత షెడ్యూల్ ప్రకారం కల్నల్ సీకే నాయుడు టోర్నీ ఈ నెలలోనే జరగాల్సి ఉండగా.. సీనియర్ మహిళల టీ20 లీగ్ వచ్చే నెలలో జరగాల్సి ఉంది. కానీ తాజాగా బీసీసీఐ నిర్ణయంతో అన్ని దేశవాళీ టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే వీటన్నింటిని మళ్లీ ఎప్పుడు నిర్వహించేది బీసీసీఐ వెల్లడించలేదు. షెడ్యూల్ ప్రకారం 2021-2022 సీజన్లో మొత్తం 700 మ్యాచ్లు జరగాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మ్యాచ్లు సజావుగా జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

అథ్లెటిక్స్ గేమ్స్ వాయిదా
కరోనా మహమ్మారి క్రికెట్నే కాదు ఇతర క్రీడలను కూడా తాకింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల చివర్లో జరగాల్సిన జాతీయ యూత్ అథ్లెటిక్స్ను వాయిదా వేస్తున్నట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా టెన్నిస్ గేమ్స్ కూడా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న, తర్వాత జరగబోయే దేశవాళీ టెన్నిస్ టోర్నీలన్నీ వాయిదా వేస్తున్నట్లు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య వెల్లడించింది. అయితే ఈ టోర్నీలన్నీ మళ్లీ ఎప్పుడూ నిర్వహించేది తెలియాల్సి ఉంది. మొదటి 6 నెలలు కరోనా విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టోర్నీలన్నీ మళ్లీ ఇప్పట్లో జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ప్రపంచకప్పై నీలి నీడలు
మరోవైపు అండర్ 19 జింబాబ్వే క్రికెట్ జట్టులోని నలుగురు ఆటగాళ్లు వైరస్ బారిన పడడంతో ఈ నెల 14 నుంచి వెస్టిండీస్ వేదికగా జరగాల్సిన అండర్ 19 ప్రపంచకప్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో టోర్నీని నిర్వహించాలా? వాయిదా వేయాలా? అనే దైలామాలో ఐసీసీ ఉంది.

బెంగాల్ జట్టులో భారీగా కరోనా కేసులు
ఇటీవల రంజీ ట్రోఫీకి సిద్ధమవుతున్న బెంగాల్ జట్టులో భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. ఆ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లతోపాటు ఒక కోచింగ్ సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డాడు. అలాగే క్యాబ్ చైర్మన్కు కూడా కరోనా సోకింది. ముంబై ఆల్రౌండర్ శివమ్ దూబేకు సైతం కరోనా సోకింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా కరోనాతో హోంక్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు.


Click it and Unblock the Notifications












