చాలా కాలంగా ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే ఎట్టకేలకు ఫాంలోకి వచ్చాడు. టీమిండియాలో ఇక చోటు కష్టమే అనుకుంటున్న సమయంలో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ సెంచరీతో ఎంతో కాలంగా ఉన్న తన పరుగుల దాహాన్ని రహానే తీర్చుకున్నాడు. దేశవాళీ రంజీ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ ట్రోఫీలో ముంబై తరఫున రహానే బరిలోకి దిగాడు. దీంతో నేడు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో పృథ్వీ షా కెప్టెన్సీలోని ముంబై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముంబై ఓపెనర్లిద్దరూ పృథ్వీ షా (1), ఆకర్షిత్ గోమెల్ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. రహానే నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు.
క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్న రహానే ఆరంభంలో ఆచి తూచి ఆడాడు. క్రీజులో కుదురుకున్నాక క్రమంగా పరుగులు రాబట్టడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 10 ఫోర్ల సాయంతో 109 బంతుల్లో అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. చివరకు 14 ఫోర్లు, 2 సిక్సులతో 212 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో తాను ఫాంలో లేనని విమర్శలు చేస్తున్న వారికి రహానే తనదైన స్టైల్లో సమాధానమిచ్చినట్టు అయింది.
రహానేకు తదుపరి పర్యటనకు టీమిండియాలో చోటు దక్కాలంటే రంజీ ట్రోఫీలో అతను భారీగా పరుగులు చేయాల్సి ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇది వరకే చెప్పాడు. గంగూలీ చెప్పినట్టుగా రహానే రాణించి సెంచరీ కొట్టడంతో రాబోయే శ్రీలంకతో టెస్టు సిరీస్కు రహానే ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. రహానే ఫాంలోకి రావడంతో అటు కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ మెగా వేలంలో అజింక్యా రహానేను కొల్కతా నైట్ రైడర్స్ కోటి రూపాయల బేస్ ప్రైజ్కు కొనుగోలు చేసింది. తాజాగా రహానే సెంచరీ కొట్టడంతో ఐపీఎల్లోనూ రహానే రాణిస్తాడని ఆ టీం ఆశిస్తుంది. ఇక తన అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 82 టెస్టు మ్యాచ్లు ఆడిన రహానే 38 సగటుతో 4,931 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 2962 పరుగులు, టీ20ల్లో 375 పరుగులు చేశాడు.