
హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2019-20 సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమవుతున్న హైదరాబాద్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు నాలుగో మ్యాచ్లో విజయాన్ని అందుకుంది. గత మూడు పరాజయాల తర్వాత ఆల్రౌండ్ షోతో అదరగొట్టి కేరళపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా సోమవారం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్లో చివరి రోజు ఆటలో హైదరాబాద్ ఆటగాళ్లు అదరగొట్టారు.
ఓవర్నైట్ స్కోరు 204/7తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు 86.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. ఇక హైదరాబాద్కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. లక్ష్యఛేదనలో హైదాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (32), పీ అక్షత్రెడ్డి (32)తో పాటు జమాల్పూర్ మల్లికార్జున్ (38), హిమాలయ్ అగర్వాల్ (34 నాటౌట్) రాణించడం హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీతో కదం తొక్కిన హైదరాబాద్ కీపర్ కొల్లా సుమంత్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో 6 పాయింట్లు చేరాయి.
మరో మ్యాచ్లో బౌలర్లు, బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించడంతో ఆంధ్ర జట్టు రెండో విజయాన్ని సాధించింది. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆంధ్ర 4 వికెట్లు కోల్పోయి 49.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఒకదశలో 50 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును కెప్టెన్ హనుమ విహారి (107 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), వికెట్ కీపర్ బ్యాట్స్మన్ శ్రీకర్ భరత్ (64 బంతుల్లో 50; 8 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 243/8తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన రాజస్తాన్ 257 పరుగులకు ఆలౌటైంది. చీపురుపల్లి స్టీఫెన్ (3/78), శశికాంత్ (3/66) చెలరేగారు. మ్యాచ్లో కీలకమైన 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శశికాంత్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. తాజా విజయంతో ఆంధ్రకు 6 పాయింట్లు దక్కాయి. ఆంధ్ర తదుపరి మ్యాచ్ను ఈ నెల 11 నుంచి ఒంగోలులో హైదరాబాద్తో ఆడుతుంది.